India US Strategic Partnership: అమెరికా భారత సైన్యం ఆధీనంలో ఉన్న అత్యంత ఆధునిక అపాచీ దాడి హెలికాప్టర్లు, ఎం–777 అల్ట్రా–లైట్ హోవిట్జర్ ఫిరంగులను నిరంతరం సిద్ధంగా ఉంచేందుకు సుమారు 482.2 మిలియన్ డాలర్ల (సుమారు 4,000 కోట్ల రూపాయలు) విలువైన సాయం ప్యాకేజీని ఆమోదించింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరచడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
ఎం–777 ఫిరంగులకు మద్దతు
హిమాలయం వంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సులభంగా తరలించి వినియోగించగల తేలికపాటి ఎం–777 ఏ2 హోవిట్జర్ ఫిరంగులకు అవసరమైన విడిభాగాలు, మరమ్మతులు, సేవలు. సైనికులకు ప్రత్యేక శిక్షణ అందించడానికి 230 మిలియన్ డాలర్లు కేటాయించారు. బ్రిటన్కు చెందిన బీఏఈ సిస్టమ్స్ ఈ మద్దతు కార్యక్రమాన్ని సమన్వయం చేస్తుంది. దీంతో ఈ ఫిరంగులు కఠినమైన వాతావరణంలో కూడా నిరంతరం పనిచేసే సామర్థ్యం సాధించగలవు.
అపాచీ హెలికాప్టర్లు సిద్ధం..
ప్రపంచంలోనే అత్యుత్తమ దాడి సామర్థ్యం కలిగిన ఏహెచ్–64డీ అపాచీ హెలికాప్టర్లను ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉంచడానికి 198.2 మిలియన్ డాలర్లు మంజూరు చేశారు. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ కంపెనీలు ఇంజనీరింగ్ సేవలు, లాజిస్టిక్స్ మద్దతు అందించనున్నాయి. దీని వల్ల ఈ హెలికాప్టర్లు మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేయగలవు.
ఈ ప్రతిపాదనను మే 18న అమెరికా విదేశాంగ శాఖ కాంగ్రెస్కు సమర్పించగా, జూన్ 17న ఫెడరల్ రిజిస్టర్లో అధికారికంగా ప్రచురించారు. అమెరికా రక్షణ విభాగం (పెంటగాన్) ఈ సాయం ప్రాంతీయ సైనిక సమతుల్యతను దెబ్బతీయదని, బదులుగా భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, సరిహద్దు సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతున్నట్లు సూచిస్తుంది.
