India ignores America warnings: అమెరికా.. ఈ పేరు వింటేనే ఒకప్పుడు భారత దేశ పరిపాలకులు భయపడేవారు. అమెరికా నుంచి ఎవరైనా ప్రతినిధులు వస్తున్నారంటే అలర్ట్ అయిపోయేవారు. అమెరికా అధ్యక్షుడు గనుక ఇండియాలో పర్యటిస్తే.. దేవుడు భూమ్మీదకి వచ్చినట్టు భావించేవారు. సకల సౌకర్యాలు చేసేవారు. గొప్ప గొప్ప సత్కారాలు చేపట్టేవారు. అమెరికా చెప్పినట్టు వినేవారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా చేతిలో కీలు బొమ్మలాగా వ్యవహరించేవారు.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమెరికా చెప్పినట్టు వినడం కాదు కదా.. అమెరికా గట్టిగా హెచ్చరికలు చేసిన సరే వినిపించుకునే పరిస్థితి లేదు. అమెరికా ఏం చేసినా సరే నిశ్శబ్దంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మారిపోయింది. నయా ఇండియా గా అవతరించింది. భయపడే స్థాయి నుంచి నిలబడే స్థాయికి.. వణికే స్థాయి నుంచి ఎదురు చెప్పే స్థాయికి ఎదిగింది. అందువల్లే ఇండియా విషయంలో అమెరికా ఒకప్పటి మాదిరిగా ఉండడం లేదు. ఒకప్పటి స్థాయిలో బెదిరింపులకు పాల్పడటం లేదు.
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతోంది. పరిణమాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనివల్ల భారత్ లాంటి అతిపెద్ద దిగుమతి దారు దేశానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. దీనివల్ల దేశంలో ధరల స్థాయి నిరంతరం పెరుగుతోంది.. ఇది ఎక్కడదాకా వెళ్తుందో తెలియదు. పైగా చమురు కంపెనీలకు ప్రతిరోజు 750 కోట్ల వరకు నష్టం వస్తుంది. కొనుగోలు ధరలు పెరిగిపోవడం.. ఇతర ఖర్చులు అధికంగా కావడంతో కంపెనీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. అంతకుముందే కంపెనీలకు రోజుకు 1000 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. ఈనెల 15న లీటర్ పెట్రోల్, డీజిల్ మీద మూడు రూపాయలు చొప్పున పెంచడంతో.. కొంతవరకు నష్టాలు భర్తీ అయ్యాయి.
క్రూడ్ ఆయిల్ విషయంలో భారత్ ముందుచూపుతో వ్యవహరించింది. రష్యా నుంచి గతంలో భారత్ ముడి చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల రష్యా నుంచి ముడి చమురు భారత్ కొనుగోలు చేయడాన్ని అమెరికా ప్రశ్నించింది. ఈనెల 16 వరకే ముడి చమురు కొనుగోలు చేయాలని డెడ్లైన్ విధించింది. ఇప్పటికే ఆ గడువు ముగిసిపోయింది. ఆయనప్పటికీ రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడం ఆగదని పెట్రోలియం శాఖ కార్యదర్శి సుజాతశర్మ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇకపై కూడా భారతదేశానికి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 17 ముందు వరకు నౌకలలో లోడ్ చేసిన రష్యా చమురును ఏ దేశమైనా కొనుగోలు చేయవచ్చు. ఆంక్షలు ఉండవు. పైగా గతంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసింది. ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తుంది.. అయితే భారత్ నుంచి ఈ ప్రకటన రావడంతో.. రష్యా ముడిచమురు కొనుగోలు చేయడానికి మినహాయింపులను అమెరికా మరో 30 రోజులపాటు పెంచడం ఇక్కడ విశేషం.
