India Bangladesh Water Dispute: బంగ్లాదేశ్లో అన్ని పార్టీల వ్యూహాత్మక ఆయుధం బంగ్లాదేశ్లో భారత్పై వ్యతిరేక భావాలు పెరుగుతున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీల మధ్య ఇది పోటీగా మారింది. ప్రతిపక్షాలు భారత్ను లక్ష్యంగా చేసుకుని ఓట్లు సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితి రెండు దేశాల మధ్య సంక్లిష్టతను పెంచుతోంది. అయితే, భారత్ వద్ద ఉన్న కీలక ఆర్థిక–పర్యావరణ లీవరేజ్ దీన్ని సమతుల్యం చేసే అవకాశం ఇస్తోంది. ఇటీవల ఎన్నికల సందర్భంగా బంగ్లాదేశ్లో భారత్పై విమర్శలు, ఆరోపణలు ఎక్కువయ్యాయి. జమాతే ఇస్లామి వంటి పార్టీలు సరిహద్దు ప్రాంతాల్లో బలం పెంచుకున్నాయి. అధికార బీఎన్పీ నాయకులు కూడా ఈ వ్యతిరేక వాదనను ఉపయోగించి రాజకీయ లాభం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాతో ఒప్పందాలు, పాకిస్తాన్తో సంబంధాలు పెంచుకోవడం వంటి చర్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇలాంటి అస్థిరత భారత్ సరిహద్దు భద్రతకు సవాలుగా మారవచ్చు.
సంబంధాలు మెరుగుపరిచేలా..
రాజకీయ నాయకులు భారత్తో సంబంధాలు మెరుగుపరచాల్సిన అవసరాన్ని కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక, వాణిజ్య, జల వనరులపై ఆధారపడిన బంగ్లాదేశ్ ఆధారం భారత్పై ఎక్కువగా ఉంది. 1996లో దేవేగౌడ, షేక్ హసీనా ప్రభుత్వాల మధ్య సంతకం అయిన గంగా (గంజెస్) జలాల పంచకం ఒప్పందం డిసెంబర్ 2026లో ముగుస్తుంది. ఫరక్కా బ్యారేజీ ద్వారా పొడి కాలంలో నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సహకారానికి ఉదాహరణగా నిలిచింది. ఒప్పందం ప్రకారం నీటి మొత్తం ఆధారంగా భారత్–బంగ్లాదేశ్ మధ్య పంపకం జరుగుతుంది.
రెన్యూవల్ కాకపోతే..
ఈ ఒప్పందం రెన్యూవల్ కాకపోతే బంగ్లాదేశ్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. భారత్ నుంచి వచ్చే 118 నదులు బంగ్లాదేశ్ వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. నీటిని నియంత్రించడం ద్వారా బంగ్లాదేశ్ రైతులు, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది కరువు పరిస్థితులు, ఆర్థిక అస్థిరతకు దారి తీయవచ్చు.సింధు ఒప్పందం నుంచి పాఠాలు పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత ఆ దేశంలో కరువు, వరదలు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది బంగ్లాదేశ్కు హెచ్చరికగా మారాలి.
గంగా నది ఒప్పందానికి బ్రేక్..
గంగా ఒప్పందంలో కూడా భారత్ కండీషన్లు విధించి, సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిరోధం, చైనా–పాక్ ప్రభావం తగ్గించడం వంటి అంశాలను చేర్చుకోవడం ద్వారా బలమైన స్థానం సాధించవచ్చు. ఒప్పందంతో పాటు తీస్తా నది జలాల పంచకం మరో కీలక సమస్య. బంగ్లాదేశ్ ఎక్కువ వాటా కోరుతోంది. ఈ వివాదం కూడా రాజకీయంగా ఉపయోగపడుతోంది. భారత్ సమగ్ర జల వ్యవస్థలో ఈ అంశాలను కలిపి చర్చించడం ద్వారా లాభదాయక ఒప్పందానికి దారి తీయవచ్చు.
సంతుల, సుదీర్ఘ లక్ష్యాలు..
భారత్ ఈ పరిస్థితిని ఉపయోగించుకుని కేవలం ఒత్తిడి మాత్రమే కాకుండా, పరస్పర లాభదాయక సహకారాన్ని ప్రోత్సహించాలి. నీటి నిర్వహణ, సంయుక్త ప్రాజెక్టులు, వాణిజ్య విస్తరణ ద్వారా బంగ్లాదేశ్ను భారత్ వైపు మళ్లించడం సాధ్యమవుతుంది. అదే సమయంలో సరిహద్దు భద్రత, ఉగ్రవాద హెచ్చరికలను విస్మరించకూడదు.ఈ ఒప్పందం పునరుద్ధరణ సమయంలో భారత్ సరైన నిర్ణయాలు తీసుకుంటే, బంగ్లాదేశ్ రాజకీయాల్లోని వ్యతిరేకతను సమర్థవంతంగా నిర్వహించి, ప్రాంతీయ స్థిరత్వాన్ని బలపరచవచ్చు.
ఇది రెండు దేశాలకు మాత్రమే కాకుండా, దక్షిణాసియా భద్రతకు కూడా మంచి సంకేతం అవుతుంది. సమయం, సందర్భం అనుకూలంగా ఉన్నప్పుడు సమర్థవంతమైన దౌత్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
