Israel Growth Story From 1948: 1948లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఇజ్రాయెల్, మరుసటి రోజే ఐదు అరబ్ దేశాల (సిరియా, జోర్డాన్, ఇరాక్, లెబనాన్, ఈజిప్ట్) దాడిని ఎదుర్కొంది. ఆ సమయంలో ఆ దేశం వద్ద ఆయుధాలు లేవు, సన్నద్ధ సైన్యం లేదు, తాగునీరు కూడా కొరతగా ఉంది. ప్రపంచమంతా ఇజ్రాయెల్ ఓడిపోతుందని భావించింది. కానీ, తెలివితేటలతో, సంకల్పంతో ఆ చిన్న దేశం అసాధ్యాన్ని సాధ్యం చేసింది.
మొదటి యుద్ధంలో తెలివితో గెలుపు..
ఆయుధాలు, మందుగుండు సామగ్రి అయిపోయిన తర్వాత, ఇజ్రాయెల్ సైనికులు ఒక విచిత్రమైన వ్యూహం అమలు చేశారు. సోడా నింపిన గాజు సీసాలను విమానాల నుంచి కిందకు విసిరారు. ఆ శబ్దం భారీ బాంబులు పేలినట్లు వినిపించింది. శత సైనికులు ఇజ్రాయెల్ వద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని భయపడి, వెనక్కి పారిపోయారు. ఈ తెలివితేటల విజయం ఇజ్రాయెల్ విజయ పరంపరకు నాంది పలికింది.
అత్యంత సమర్థవంతమైన గూఢచార సంస్థ
యుద్ధంలో గెలిచిన ఇజ్రాయెల్, తన భద్రత కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థ మొసాద్ను నిర్మించింది. 1960ల్లో మొసాద్ గూఢచారి ఏలీ కొహెన్ సంపన్న వ్యాపారిగా సిరియాలోకి ప్రవేశించాడు. అక్కడి ఉన్నతస్థాయి నాయకులు, సైనికాధికారులతో స్నేహం చేశాడు. వారు అతడిని సైనిక స్థావరాలకు కూడా తీసుకెళ్లారు. అక్కడ సైనికులు ఎండలో ఇబ్బంది పడుతున్నారని గమనించిన కొహెన్, ‘యూకలిప్టస్ చెట్లు నాటితే నీడ వస్తుంది‘ అని సూచించాడు. నమ్మకంతో సిరియన్ అధికారులు ఆ చెట్లను నాటించారు. కొన్నేళ్ల తర్వాత, 1967 ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ ఆ యూకలిప్టస్ చెట్లను గుర్తుగా చేసుకుని, సిరియా సైనిక స్థావరాలను ఖచ్చితంగా గుర్తించి, ధ్వంసం చేసింది. ఒక్క చెట్టు నాటడం ద్వారా శత్రువు సైనిక రహస్యాలను ఛేదించిన చరిత్ర ఇది.
నీటి కొరత నుంచి డ్రిప్ ఇరిగేషన్ విప్లవం..
ఇజ్రాయెల్లో సహజ వనరులు లేవు. నీరు చాలా తక్కువ. కానీ, ఆ కొరతనే అవకాశంగా మార్చుకుంది. డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) పద్ధతిని ఇజ్రాయెల్ కనిపెట్టింది. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిస్తున్నారు. ఎడారి భూములను సస్యశ్యామలం చేశారు. ఈ టెక్నాలజీని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది. భారత్తో సహా పలు దేశాలు ఈ టెక్నాలజీని అనుసరిస్తున్నాయి.
సోవియట్ యూనియన్ పతనం ఇజ్రాయెల్కు వరంగా..
1990లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత, దాదాపు 10 లక్షల మంది యూదులు ఇజ్రాయెల్కు వలస వచ్చారు. దీంతో జానాభా ఒక్కసారిగా 20 శాతం పెరిగింది. వీరిలో చాలా మంది ఇంజినీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఉన్నారు. దీంతో నైపుణ్యం కలిగిన మానవ వనరు లభ్యమైంది. పరిశోధన, అభివృద్ధిలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే ముందుండి పోయింది.
స్టార్టప్ నేషన్గా…
విదేశీ కంపెనీలు ఇజ్రాయెల్లో పెట్టుబడి పెట్టడానికి భయపడేవి. ఈ సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక విప్లవాత్మక పథకం ప్రవేశపెట్టింది. విదేశీ కంపెనీ 60 శాతం పెట్టుబడి పెడితే, ఇజ్రాయెల్ 40 శాతం పెడుతుంది.నష్టం వస్తే ఇజ్రాయెల్ తన 40 శాతం వాటాను పూర్తిగా కోల్పోతుంది నష్టాన్ని భరిస్తుంది. లాభం వస్తే విదేశీ కంపెనీ ఇజ్రాయెల్ 40 శాతం వాటాను కేవలం పెట్టుబడి ధరకే కొనుగోలు చేయవచ్చు. మొత్తంగా లాభం మీది, నష్టం మాది‘ అన్న ఈ ఆఫర్ విదేశీ కంపెనీలను క్యూ కట్టించింది. ఫలితంగా ఇజ్రాయెల్ స్టార్టప్ నేషన్గా అవతరించింది. ప్రపంచంలోనే తలసరికి అత్యధిక స్టార్టప్లు ఇజ్రాయెల్లో ఉన్నాయి. 2009 నాటికే 63 ఇజ్రాయెల్ కంపెనీలు లిస్ట్ అయ్యాయి. ఇది ఇతర ఏ దేశానికీ లేని ఘనత. ఇజ్రాయెల్ తన సైనిక అవసరాల కోసం అభివద్ధి చేసిన టెక్నాలజీలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నాయి.
75 ఏళ్ల క్రితం తాగునీరు లేని, చుట్టూ శత్రు దేశాలతో చిక్కుకున్న చిన్న దేశం, ఇప్పుడు ప్రపంచంలోనే 8వ శక్తివంతమైన దేశంగా, టెక్నాలజీ సూపర్ పవర్గా ఎదిగింది. ఇజ్రాయెల్ కథ నిరూపించేది ఒక్కటే..సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని. ఆయిల్ బావుల కంటే తెలివితేటలు గొప్పవి. సహజ వనరుల కంటే మానవ వనరులు విలువైనవి. ఆవిష్కరణలే అసలైన శక్తి అని నమ్మి వేగంగా సూపర్ పవర్గా మారింది.
