Nepal : నేపాల్‌లో మరో ప్రమాదం.. కుప్పకూలిన హెలిక్యాప్టర్‌.. ఐదుగురు మృతి! ఎందుకీ పరిస్థితులు

విమాన ప్రమాదాలకు కేరాఫ్‌ నేపాల్‌. అక్కడి వాతావరణ పరిస్థితులు, విమానాశ్రయ రన్‌వే, హిమాలయ పర్వతాల కారణంగా నేపాల్‌లో ఏటా విమాన ప్రమాదాలు జరుగుతాయి. జూలై 25న విమాన ప్రమాదం జరిగింది.

Written By: Raj Shekar, Updated On : August 7, 2024 6:14 pm
Follow us on

Nepal : విమాన ప్రమాదాలకు కేరాఫ్‌ మన పొరుగు దేశం నేపాల్‌.  టేబుల్‌టాప్‌ రన్‌వే కారణంగా అక్కడ ఏటా విమాన ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఎయిర్‌పోర్టుల్లో జరిగే విమాన ప్రమాదాల్లో అత్యధికం ఇలాంటి రన్‌వేలపైనే చోటుచేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎత్తయిన  ప్రదేశాల్లో ఉండే రన్‌వేలను టేబుల్‌ టాప్‌ రన్‌వేలు అంటారు. ఈ రన్‌వేలు చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో ఉంటాయి. వీటికి ఒకవైపు లేదా రెండు వైపులా లోయ మాదిరిగా ఉంటుంది. కానీ దూరం నుంచి చూస్తే రన్‌వే, పక్కనున్న భూభాగం సమాంతరంగానే ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. ఇక్కడ టేకాఫ్, ల్యాండింగ్‌ చేసేటప్పుడు పైలట్‌ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలి. ఏ చిన్న పొరబాటు జరిగినా విమానం ఓవర్‌షూట్‌ అయి పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంటుంది. నేపాల్‌లో ఇలాంటి రన్‌వేలు 7 ఉన్నాయి.  మన దేశంలోనూ టేబుల్‌టాప్‌ రన్‌వేలు నాలుగు ఉన్నాయి.  తాజాగా జూలై 25న నేపాల్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మండులోని త్రిబువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ప్రమాదంలో పైలెట్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన పక్షం రోజులకే తాజాగా నేపాల్‌లో హెలిక్యాప్టర్‌ కుప్ప కూలింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు.

శివపురి ప్రాంతంలో..
నేపాల్‌లోని నువాకోట్‌ జిల్లాలోని శివపురి ప్రాంతంలో బుధవారం(ఆగస్టు 7న) మధ్యాహ్నం ఎయిర్‌ డైనాస్టీ హెలికాప్టర్‌ కూలిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. హెలికాప్టర్‌ ఖాట్మండు నుంచి బయలుదేరి సయాఫ్రూబెన్సికి వెళ్తోంది. హెలికాప్టర్‌ను సీనియర్‌ కెప్టెన్‌ అరుణ్‌ మల్లా పైలట్‌ చేశారు. టేకాఫ్‌ అయిన మూడు నిమిషాలకే గ్రౌండ్‌ స్టాఫ్‌తో సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయినప్పుడు అందులో నలుగురు చైనా జాతీయులు,  పైలట్‌ సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. చైనా జాతీయులు రాసువాకు వెళ్తున్నారని నేపాల్‌ మీడియా తెలిపింది.

శౌర్య చౌక్‌లో కుప్పకూలిన చాపర్‌..
మధ్యాహ్నం 1:54 గంటలకు ఖాట్మండు నుంచి హెలికాప్టర్‌ బయలుదేరినట్లు త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సోస్‌లను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. సూర్య చౌర్‌కు చేరుకున్న తర్వాత 1:57 సమయంలో హెలికాప్టర్‌ అధికారులతో సంబంధాలు కోల్పోయింది. తర్వాత సూర్య చౌర్‌–7 వద్ద కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో చాపర్‌లో ఉన్న నలుగురు చైనీయులతోపాటు పైలెట్‌ అరుణ్‌ మల్లా కూడా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది.