Elon Musk Prediction: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు ఎలాన్ మస్క్. త్వరలోనే మొదటి ట్రిలియనీర్గా (సుమారు రూ. కోటి కోట్ల విలువ గల ఆస్తి) అవతరించేందుకు చాలా దగ్గరగా ఉన్నారు. టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల ద్వారా ఆయన సంపాదించిన ఆస్తి విలువ రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ గొప్ప సంపదను సాధించిన మస్క్, డబ్బు గురించి చాలా ఆసక్తికరమైన, భవిష్యత్తును సూచించే వ్యాఖ్యలు చేశారు.
డబ్బుకు విలువ ఉండదట..
రానున్న రోజుల్లో డబ్బుకు ఇప్పటి విలువ ఉండదని మస్క్ పేర్కొన్నారు. కారణం కృత్రిమ మేధస్సు(ఏఐ), రోబోలు అనేక రకాల వస్తువులను సులభంగా తయారు చేస్తాయని తెలిపారు. అవి మనుషులు చేసే అనేక సేవలను కూడా అందిస్తాయని వెల్లడించారు. ఫలితంగా మనుషులకు చేయడానికి పనులు తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా డబ్బు ఇవ్వవలసి వస్తుందని జోష్యం చెప్పారు. పని చేయకుండానే ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పని, ఆదాయం, డబ్బు అనే మౌలిక భావనలు పూర్తిగా మారిపోతాయని అంచనా వేశారు.
ఏఐ, రోబోలతో ఆర్థిక విప్లవం..
మస్క్ చెప్పిన ఈ దృశ్యం ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లు పని చేసి డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో వస్తువులు కొనడం అనే చక్రం మారిపోతుంది. ఏఐ, రోబోలు ఉత్పత్తి చేసే వస్తువులు, సేవలు చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. దీంతో వస్తువుల కొరత తగ్గి, సమృద్ధి పెరుగుతుంది. దీంతో డబ్బు అనే విలువ క్రమంగా తగ్గిపోతుందని మస్క్ భావిస్తున్నారు.
భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ ట్రాష్..
ఎలాన్ మస్క్ ఇలా చెప్పడం ఆయన సాధారణ ఆలోచన కాదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయనే డబ్బుకు విలువ లేని రోజులు రానున్నాయని చెప్పడం ఆసక్తికరం. ఇది ఒక విధంగా పోస్ట్–స్కార్సిటీ ఎకానమీ (కొరత లేని ఆర్థిక వ్యవస్థ) గురించి ఆయన చేస్తున్న అంచనా. ఏఐ, ఆటోమేషన్ వల్ల మనుషులు చేసే పనులు తగ్గిపోతాయని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితిలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే భావన ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉంది. ప్రభుత్వాలు ప్రతి పౌరుడికి నెలవారీగా కొంత డబ్బు ఇవ్వడం ద్వారా ప్రజలు ఆర్థికంగా భద్రంగా ఉండేలా చూడాలని మస్క్ కూడా ఇంతకు ముందు చెప్పారు. అయితే ఇది కేవలం సానుకూల వైపు మాత్రమే కాదు. పని లేకపోతే మనుషులకు జీవితంలో ఉత్సాహం తగ్గిపోతాయని కొందరు భయపడుతున్నారు. మరోవైపు, ఏఐ వల్ల వచ్చే సమృద్ధిని సరిగ్గా పంపిణీ చేయగలిగితే మానవజాతి మరింత సుఖంగా జీవించే అవకాశం ఉంది.
మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక వైపు ఆయన టెక్నాలజీపై ఉన్న నమ్మకాన్ని చెబుతున్నాయి. మరోవైపు, భవిష్యత్తులో సంపద, విలువ, పని అనే భావనలు పూర్తిగా మారిపోతాయని సూచిస్తున్నాయి. ట్రిలియనీర్ అవ్వబోయే వ్యక్తి కూడా డబ్బు అనేది శాశ్వతం కాదని, భవిష్యత్తులో దాని ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పడం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.

