Donald Trump : అమెరికాలో అధ్యక్షులపై దాడి కొత్తది కాదు.. గతంలో ఎలాంటి సంఘటనలు జరిగాయంటే..

ఈ ఘటన జరిగినప్పుడు ట్రంప్ ను కాపాడేందుకు భద్రత దళాలు వెంటనే వేదిక పైకి చేరుకున్నాయి. ట్రంప్ ను చుట్టుముట్టాయి. ఆయనను వేదిక నుంచి హుటాహుటిన కిందికి తీసుకెళ్లాయి. ఆ సమయంలో ర్యాలీకి హాజరైన వారు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇందులో ఒక వ్యక్తి మరణించాడు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని భద్రతా దళాలు కాల్చి చంపాయి

Written By: Bhaskar, Updated On : July 14, 2024 10:32 am
Follow us on

Donald Trump :  అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఆదివారం పెన్సిల్వేనియా లోని బట్లర్ కౌంటిలో డొనాల్డ్ ట్రంప్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. Make America great again పేరుతో ఆయన ఎన్నికల ప్రచారం సాగించారు. ఈ ప్రచారంలో భారీగా అమెరికన్లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రసంగించడం మొదలుపెట్టారు. అకస్మాత్తుగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్ళింది. దీంతో ట్రంప్ ఒక్కసారిగా కిందకి వంగారు. వేదిక కింద కూల పడిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది ఆయనను చుట్టుముట్టారు. వలయం లాగా ఏర్పడ్డారు. గాయపడిన ట్రంప్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. మీడియా, సోషల్ మీడియాలో ట్రంప్ పై కాల్పులకు సంబంధించిన వార్తలతో హోరెత్తిపోతోంది.

ఈ ఘటన జరిగినప్పుడు ట్రంప్ ను కాపాడేందుకు భద్రత దళాలు వెంటనే వేదిక పైకి చేరుకున్నాయి. ట్రంప్ ను చుట్టుముట్టాయి. ఆయనను వేదిక నుంచి హుటాహుటిన కిందికి తీసుకెళ్లాయి. ఆ సమయంలో ర్యాలీకి హాజరైన వారు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇందులో ఒక వ్యక్తి మరణించాడు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. కొందరు తమ సెల్ ఫోన్లలో ఆ ఘటనను చిత్రీకరించగా.. అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీలు వెంటనే రంగంలోకి దిగి.. కాల్పులకు తెగబడిన వ్యక్తికి సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని తమతో పాటు తీసుకెళ్లాయి.

మరి కొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయనగా జరిగిన ఈ సంఘటన.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ ఘటన జరగడంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే గతంలో ఈతరహా సంఘటనలు అమెరికాలో చోటుచేసుకున్నాయి. అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు పలు ప్రమాదాలకు గురయ్యారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కలకలం నెలకొంది. 1963 లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడి తన మోటార్ కేడ్ లో ప్రయాణిస్తుండగా హత్యకు గురయ్యారు. మరో ఐదు సంవత్సరాలకు అంటే 1968లో ఆయన సోదరుడు బాబీ కెన్నడి ని కొందరు దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. ఆ తర్వాత అమెరికా మరో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పై 1981లో హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను చంపేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన వెంట్రుకవాసిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తర్వాత అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీలు దర్యాప్తు నిర్వహించి.. ఆ దుండగులను మట్టు పెట్టాయి.

ఈ ఘటనల తర్వాత అమెరికాలో అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, మాజీ అధ్యక్షులకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా భద్రత దళాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ట్రంప్ పై కాల్పులు జరిగిన తర్వాత..భద్రతా దళాలు వెంటనే స్పందించాయి. ట్రంప్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాయి. ఆయన చెవికి గాయం కావడంతో అత్యవసర వైద్య విభాగానికి తరలించాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. కాల్పుల ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షురాలు కమలాహారీస్ కూడా కాల్పుల ఘటనను నిరసించారు. అమెరికా భద్రత దళాలు చేసిన పనిని అభినందించారు.