US Iran Conflict: గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు అడ్డంకులు కలిగించే చర్యల నేపథ్యంలో అమెరికా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేయగా, ఇరాన్ నుంచి కూడా ప్రతీకార దాడులు తీవ్రమయ్యాయి.
జార్డన్లో ఇరాన్ సైనిక చర్యలు
ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్ జార్డన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ‘‘నాసర్–2’’ అనే ఆపరేషన్ నిర్వహించింది. ఈ చర్యలో అక్కడి రాడార్ నియంత్రణ వ్యవస్థలు, విమాన ఆశ్రయాలలో ఉన్న ఎఫ్–15 యుద్ధ విమానాలు పూర్తిగా నాశనమయ్యాయి. రుక్బాన్ ప్రాంతంలోని అమెరికా సైనిక సముదాయం మీద జరిగిన దాడిలో అనేక అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
అమెజాన్ డేటా సెంటర్ లక్ష్యంగా
ఇరాన్ సైన్యం బహ్రెయిన్లోని అమెజాన్ కంపెనీకి చెందిన ప్రధాన డేటా సెంటర్ను క్రూయిజ్ క్షిపణులతో ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఇది అమెరికా వైపు నుంచి జరిగిన పౌర సౌకర్యాలపై దాడులకు ప్రతీకారంగా చేసిన చర్య అని ఇరాన్ వైపు నుంచి తెలిపారు. అయితే అమెజాన్ కంపెనీ గానీ, బహ్రెయిన్ ప్రభుత్వం గానీ ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు.
కువైట్పై డ్రోన్, క్షిపణి దాడులు
ఇరాన్ సైన్యం ఆపరేషన్ లైట్నింగ్ పేరుతో కువైట్లోని అమెరికా సైనిక క్యాంపులపై డ్రోన్లు, ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులతో విరుచుకుపడింది. అరిఫ్జాన్, అహ్మద్ అల్–జాబెర్ ఎయిర్ బేస్లలోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, హిమార్స్ లాంచర్లు దెబ్బతిన్నాయి. అలీ అల్–సలేమ్ ఎయిర్ బేస్లోని ఎంక్యు–9 డ్రోన్ హ్యాంగర్పై జరిగిన దాడిలో అనేక డ్రోన్లు నాశనమయ్యాయి.
అమెరికా మరింత దాడులు చేస్తున్నట్లు ప్రకటించగా, ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయి యుద్ధంగా అభివర్ణించారు. గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా సైన్యం పూర్తిగా వైదొలగే వరకు తమ చర్యలు కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవైపు దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరుగుతున్నప్పటికీ, మొత్తం ప్రాంతం భద్రతా ప్రమాదంలో పడింది.

