China: డ్రాగన్ కంట్రీ చైనా ప్రపంచంలో రెండో పవర్ఫుల్ దేశం. మొదటి స్థానం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అడ్డదారులు కూడా తొక్కుతుంది. ఈ క్రమంలో 2016, జూన్ 12 పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (పీసీఏ) తీర్పు వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, న్యూజిలాండ్, రొమేనియా, స్లోవేనియా మొత్తం 14 దేశాలు ఒకటిగా ముందుకు వచ్చాయి. ఈ సంయుక్త ప్రకటనలో 2016 తీర్పును ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించి, అది చైనా, ఫిలిప్పీన్స్ మధ్య అంతిమమైనది, చట్టబద్ధంగా బంధించేలా ఉంది, నిర్ణయాత్మకమైనది అని స్పష్టం చేశాయి. చైనా విస్తృత సముద్ర హక్కుల వాదనలకు అంతర్జాతీయ చట్టం(యూఎన్సీఎల్ఓఎస్) ప్రకారం ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం లేదని వారు ధ్రువీకరించారు. శాంతియుత పరిష్కారం, బలవంతపు చర్యలను వ్యతిరేకించడం, నావిగేషన్, ఓవర్ఫ్లైట్ స్వేచ్ఛను కాపాడడం వంటి అంశాలను ఈ ప్రకటనలో నొక్కి చెప్పాయి.
చైనా తీవ్ర ఆగ్రహం..
ఈ సంయుక్త ప్రకటనతో చైనా బాగా అసంతృప్తి చెందింది. బీజింగ్లోని జపాన్ ఎంబసీలోని చీఫ్ మినిస్టర్ (డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్)ను విదేశాంగ శాఖ అధికారి సమన్లు జారీ చేసి, తీవ్ర అసంతృప్తి, నిరసన వ్యక్తం చేసింది. జపాన్ ఇతర దేశాలతో కలిసి తప్పుడు తీర్పును ముందుకు తెచ్చి, ప్రాంతీయ శాంతి-స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని, యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవస్థను సవాలు చేస్తోందని చైనా ఆరోపించింది. జపాన్ ఈ వివాదంలో నేరుగా పాల్గొనే దేశం కాదు కాబట్టి దానికి చైనా సార్వభౌమాధికారం గురించి మాట్లాడే హక్కు లేదని చైనా పేర్కొంది. తన వాదనలను బలపరచుకోవడానికి చైనా సోషల్ మీడియాలో వీడియోను కూడా పంచుకుంది.
యూరోపియన్ యూనియన్ మద్దతు
ఈ తీర్పు 10వ వార్షికోత్సవం సందర్భంగా యూరోపియన్ యూనియన్ కూడా ప్రత్యేక ప్రకటన విడుదల చేసి, 2016 అవార్డును ముఖ్యమైనదిగా అభివర్ణించింది. యూఎన్సీఎల్ఓఎస్ ప్రకారం శాంతియుత పరిష్కారాలకు మద్దతు ఇచ్చింది.
వివాదం యొక్క నేపథ్యం
2016లో ఫిలిప్పీన్స్ చైనాపై దాఖలు చేసిన కేసులో పీసీఏ తీర్పు చైనా యొక్క “నైన్-డాష్ లైన్”, చారిత్రక హక్కుల వాదనలను తిరస్కరించింది. ఈ తీర్పు ప్రకారం చైనా విస్తృత సముద్ర హక్కులకు అంతర్జాతీయ చట్టం కింద ఆధారం లేదు. చైనా ఈ తీర్పును ఎప్పటి నుంచో తిరస్కరిస్తోంది.
వ్యూహాత్మక ప్రాముఖ్యత
దక్షిణ చైనా సముద్రం ప్రపంచ వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైన రవాణా మార్గం. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున చమురు, సహజవాయువు రవాణా జరుగుతుంది. చైనా కృత్రిమ దీవుల నిర్మాణం, సైనిక కార్యకలాపాలు చేస్తోంది. ఫిలిప్పీన్స్ తన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో చైనా ప్రమాదకరమైన మాన్యూవర్లు చేస్తోందని ఆరోపిస్తోంది. అమెరికా, దాని మిత్రదేశాల నౌకాదళ పర్యటనలు, చైనా గస్తీల మధ్య ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ సముద్ర చట్టాల అమలు, వాణిజ్య స్వేచ్ఛ వంటి అంశాలపై దృష్టి సారించాయి.
