Viral Video : నీ క్రియేటవిటీ తగలెయ్యా.. వరద బురదపై నిరసన : వీడియో వైరల్

వర్షాలు కురిసినప్పుడు వాననీరు పారడం పరిపాటి. వాన నీరు కాస్త వరదలాగా మారడం సాధారణం. వరదలో బురద ఏర్పడటం మరింత సర్వసాధారణం. అలాంటి బురదపై ఓ వ్యక్తి చేసిన నిర్వాకం సంచలనంగా మారింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 27, 2024 8:07 am

Viral video

Follow us on

Viral Video :  సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో.. ఓ వ్యక్తి బురదలో పడి దొర్లుతున్నాడు. అతడికి ఏమైనా అయిందా అంటే.. అలాంటిది ఏమీ లేదు. బేషుగ్గా ఉన్నాడు. అతని ఆరోగ్యం కూడా సక్రమంగానే ఉంది. చూడ్డానికి అందంగానే ఉన్నాడు. నిండుగా గడ్డం.. దానికి తగ్గట్టుగా మీసాలతో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. అతనికి ఏమైందో తెలియదు కాని.. కాళ్ల నుంచి పొట్ట భాగం వరకు గులాబీ రంగు పాలిథిన్ కవర్ చుట్టుకున్నాడు. ఉదర భాగాన్ని గోధుమ రంగు వస్త్రంతో కవర్ చేశాడు. అరికాళ్ళకు ఏవో ఆకులు కట్టుకున్నాడు. చూడబోతే సాగర కన్య లాగా కనిపిస్తున్నాడు. సాహసవీరుడు సాగర కన్య సినిమాలో శిల్పా శెట్టి లాగా జలకన్య అవతారం ఎత్తాడు. నీళ్లలో అటు ఇటు పడి దొర్లుతున్నాడు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వైసిపి సోషల్ మీడియా విభాగం మాత్రం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో చోటుచేసుకుందని చెబుతోంది. దీనికి తెలుగుదేశం పార్టీ గట్టిగా రిప్లై ఇస్తుంది.

” మొన్న విజయవాడలో విస్తారంగా వర్షాలు కురిసాయి. బుడమేరు వాగు ఉప్పొంగి ప్రవహించింది. దానివల్ల నగరం మొత్తం నీట మునిగింది. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. అందువల్లే వర్షాలు తగ్గినప్పటికీ.. వరద నీరు ఇంకా రోడ్లమీద కనిపిస్తోంది. ఫలితంగా ప్రజలు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారని” వైసిపి సోషల్ మీడియా విభాగం ఆరోపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే టిడిపి సోషల్ మీడియా విభాగం కూడా బలమైన కౌంటర్ ఇస్తోంది. ” విజయవాడ నగరం ప్రశాంతంగా మారిపోయింది. వరదలు తగుముఖం పట్టాయి. బుడమేరు కు పడిన గండ్లను ప్రభుత్వం పూడ్చింది. వరదనీరు రాకుండా చర్యలు తీసుకుంది. అయినప్పటికీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో జరిగిన సంఘటనను ఏపీకి ముడి పెడుతున్నారు. మీకు 11 సీట్లు వచ్చినా బుద్ధి మాత్రం రావడం లేదు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించి మారండి” అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు హితవు పలుకుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం అటు వైసిపి నాయకులు చెప్పలేకపోతున్నారు. విజయవాడ నగరం పై బురద ను సంపూర్ణంగా తొలగించామని టిడిపి నాయకులు వివరించలేకపోతున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడో ఉత్తర భారత దేశంలో జరిగిందని.. దానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆపాదిస్తున్నారని కొంతమంది నెటిజన్లు ఆరోపిస్తున్నారు.. ఇలాంటి వీడియోల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోతుందని.. పెట్టుబడులు కూడా రావని.. అప్పుడు కొత్త ఉద్యోగాల సృష్టి ఎలా జరుగుతుందని.. రాష్ట్రం ఎలా బాగుపడుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి టిడిపి అనుకూల నెటిజన్ల నుంచి సానుకూల స్పందన రావడం విశేషం.