
Nellore: సెల్ఫోన్ అందుబాటులోకి వచ్చాక.. ఇంటర్నెట్ చౌక అయ్యాక.. అది మంచికంటే చెడే ఎక్కువ చేస్తోంది. యువతను పెడదారి పట్టిస్తోంది. బంధాలను దూరం చేస్తుంది. ప్రాణాలు కూడా తీస్తోంది. తాజాగా నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని కారు డ్రైవర్తో శృంగారం జరిపి గర్భం దాల్చింది. అబార్షన్ కారణంగా తరగతి గదిలోనే మృతిచెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గదిలో అబార్షన్కు యత్నం..
మర్రిపాడు మండలానికి చెందిన యువతి(19) నెల్లూరులో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 11న కళాశాల విద్యార్థులందరూ ప్రాంగణంలో ఉండగా.. యువతి ఒక్కతే గదిలో ఉండి తలుపులకు గడియ పెట్టుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి స్నేహితులు తలుపులు పగలగొట్టి చూడగా తరగతి గదిలోనే తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. పక్కనే ఆరు నెలల పిండం ఉంది. తోటి విద్యార్థులు హుటాహుటిన తల్లిని, పిండాన్ని ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తల్లి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నెల్లూరుగ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తరగతి గదిలోనే అబార్షన్ అయ్యిందా? లేదా వీడియో ద్వారా తనకు తానే అబార్షన్ చేసుకుందా? అనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
కారు డ్రైవర్తో సంబంధం..
యువతి సెల్ఫోన్ ఆధారంగా అనంతసాగరానికి చెందిన కారు డ్రైవరుతో పరిచయాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ పరిచయం తర్వాత ప్రేమ పేరుతో శృంగారానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గర కావడంతో యువతి గర్భం దాల్చింది అని సమాచారం. అయితే గర్భం విషయం బయటకు రాకుండా అబార్షన్ చేసుకోవాలనుకున్న బాధితురాలు సొంతంగా అబార్షన్కు యత్నించి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూట్యూబ్ వీడియోల కారణంగానే ఇలా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారిస్తున్నట్లు నెల్లూరు గ్రామీణ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

దారితప్పుతున్న యువతకు తాజాగా బీటెక్ విద్యార్థిని మరణం ఒక ఉదాహరణ అని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని పేర్కొంటున్నారు. పిల్లలు కూడా కన్నవారికి అన్యాయం చేస్తున్నామన్న భావన కలిగేలా ఉండాలని సూచిస్తున్నారు.