Queen Elizabeth II Visited Hyderabad: బ్రిటీష్ సామ్రాజ్యాన్ని సుదీర్ఘ కాలం ఏలిన రాణి ఎలిజిబెత్—–2కు తెలుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలే ఉన్నాయి. దాదాపు 70 సంవత్సరాలకుపైగా రాణిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలే నడిపారు. అందరి అభిమానాన్ని చూరగొన్నారు. అందుకే ఆమె మృతిపై దేశాధినేతలు సంతాపం తెలిపారు. ప్రేమను పంచే దేవతగా, ఒక మహోన్నత మానవతావాధిగా అభివర్ణించారు. ఎలిజిబెత్2కు భారత్ తో మంచి సంబంధాలే నడిపారు. ఎటువంటి వివక్ష చూపిన దాఖలాలు లేవు. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన రాణి ఎలిజిబెత్ 2కు తెలుగు ప్రజలు ఆతిథ్యమిచ్చిన సందర్భాలున్నాయి. 40 ఏళ్ల కిందట ఆమె భాగ్యనగరానికి వచ్చారు. ఇక్కడే మూడు రోజుల పాటు గడిపారు. తెలుగు ప్రజల ఆత్మీయ అభిమానాలను చూసి పులకించిపోయారు. బ్రిటీష్ పాలకులపై పోరాడిన దేశస్తులే కల్మషం లేని ప్రేమను పంచడంతో పులకించుకుపోయారు.

కామన్వెల్త్ సదస్సు ప్రారంభానికి విచ్చేసిన దంపతులు..
1983లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ సదస్సు ప్రారంభోత్సవానికి రాణి రెండో ఎలిజిబెత్ భారతదేశానికి వచ్చారు. పది రోజుల పాటు దేశవ్యాప్తంగా పర్యటించారు. భాగ్యనగరంలో మూడు రోజుల పాటు విడిది చేశారు. 1983 నవంబరు 18న రాత్రి ప్రత్యేక విమానంలో రెండో ఎలిజిబెత్ రాణి తన భర్త చార్లెస్ ఫిలిప్ తో వచ్చారు.నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, గవర్నర్ రామ్ లాల్ రాణి దంపతులకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో రాణిని చూసేందుకు వచ్చిన జనంతో బెగంపేట విమానాశ్రయం నిండిపోయింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాణి దంపతులకు నాడు విడిది ఏర్పాటుచేశారు. తరువాత మూడు రోజుల వరుస పర్యటనలతో బిజీ అయ్యారు. తెలుగువారి పండుగలు, పూజల్లో పాల్గొన్నారు. ఇక్కడి ఆత్మీయ స్వాగతాలను చూసి పులకించుకుపోయారు. కుతుబ్ షాహి సమాధులను దర్శించుకున్నారు. మరో విశేషమేమిటంటే రాణి దంపతులు భాగ్యనగరంలోనే వివాహ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. 1983 నవంబరు 20న బొల్లారం సమీపంలోని సుదీర్ఘ చరిత్ర కలిగిన హోలి ట్రినిటీ చర్చిలో దంపతులిద్దరూ ప్రార్థనలు చేశారు.
Also Read: Grand Statue Of Netaji: టిఆర్ఎస్ నేత ఇచ్చిన రాయితోనే కొత్త పార్లమెంట్ లో నేతాజీ విగ్రహం
ఎన్నోవిశిష్టతలు
అయితే రెండో ఎలిజిబెత్ రాణి పర్యటన ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకుంది. మేడ్చల్ సమీపంలోని దేవరయాంజల్ లో ఓ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాణి దంపతులు అక్కడ ఉన్న సీతారాముల ఆలయంలొ పూజలు చేశారు. రాణి పర్యటనను కవర్ చేసేందుకు 30కు పైగా మీడియా సంస్థల ప్రతినిధులు ఆమె వెంట వచ్చారు. వారికి ప్రత్యేకంగా ఒక మీడియా పాయింట్ ను సైతం ఏర్పాటుచేశారు. ప్రపంచంలో ఏ మూలకైనా వార్తలు పంపే వీలుగా ఇంటర్నేషనల్ ట్రంక్ లైన్లు, టైపు రైటర్లు ఏర్పాటుచేశారు. అప్పట్లో మన దేశీయ మీడియా ప్రతినిధులకు ఈ ఏర్పాట్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదే సమయంలో 1983 నవంబరు 21న రాణిదంపతులు తిరుగు పయనమైనప్పుడు నాటి సీఎం ఎన్టీ రామారావు, గవర్నర్ రామ్ లాల్, మండలిలో విపక్ష నేత రోశయ్య, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ అరుదైన చిత్రం తాజాగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఎలిజిబెత్ రాణి మరణంతో నెటిజెన్లు ఫొటోను ట్రోల్ చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు.

విజయనగరం మహారాజులతో…
విజయనగరం పూసపాటి రాజవంశీయులతో రాణి ఎలిజిబెత్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. 1961లో రాణి బెనారస్ లోని విజయనగరం భవన్ ను సందర్శించారు.ఆమెకు పూసపాటి రాజవంశీయులు పూసపాటి విజయరామ గజపతిరాజు స్వాగతం పలికారు. విజయనగరం సంస్థానం, పరిపాలన గురించి సమగ్రంగా వివరించారు. నాటి రాజుల ఔన్నత్యాన్ని వారికి విడమరచి చెప్పారు. ఇక్కడి పరిస్థితులను ఆమెకు వివరించే ప్రయత్నం చేశారు. రెండో ఎలిజిబెత్ రాణి మరణించడంతో విజయనగరంలోని అశోక్ బంగ్లా ఈ ఫొటోను విడుదల చేసింది.


