
Tragedy On Maharashtra: అసలే వేసవి.. మరోవైపు మండుతున్న ఎండలు.. వగగాలులతో ఇంట్లో కూర్చున్న జనమే బెంబేలెత్తిపోతున్నారు. వేడి తట్టుకోలేక పిల్లలు, వృద్దులు తల్లడిల్లుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన రెబెల్– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఎర్రటి ఎండలో నిర్వహించిన సభ 11 మంది ప్రాణం తీసింది. గుండెపోటుతో ఒకేసారి 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ 50 మంది కూడా గుండె సంబంధిత ఇబ్బందులతో చికిత్స పొందుతోన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందజేయడానికి ప్రభుత్వం సభ ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవీ ముంబైలోని ఖార్ఘర్లో ఈ సభ ఏర్పాటు చేశారు. వేలాదిమందిని సభకు తరలించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పలువురు మంత్రులు ఇందులో పాల్గొన్నారు. అప్పాసాహెబ్ ధర్మాధికారి, మరికొందరికి అమిత్ షా మహారాష్ట్ర భూషణ్ అవార్డులను అందజేశారు.
గంటలపాటు ఎండలోనే..
ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ అవార్డుల ప్రదానోత్సవం మధ్యాహ్నం వరకూ కొనసాగింది. ఓపెన్ గ్రౌండ్లో ఇది ఏర్పాటైంది. ఎలాంటి షెడ్లు గానీ, షామియానాలు గానీ ఏర్పాటు చేయలేదు మహారాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వేలాది మంది ఎర్రటి ఎండలో కొన్ని గంటల తరబడి కూర్చోవాల్సి వచ్చింది. ఈ సభకు ఆతిథ్యాన్ని ఇచ్చిన ఖార్ఘర్లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
11 మందికి గుండెపోటు..
ఎలాంటి షెడ్లు గానీ, షామియానా గానీ ఏర్పాటు చేయకపోవడం, కొన్ని గంటల పాటు ఎండలో కూర్చోవడం వల్ల అవార్డుల ప్రదానోత్సవం ముగిసేసరికి చాలామంది వడదెబ్బకూ గురయ్యారు. వారిని హుటాహుటిన ఎంజీఎం కామోతె ఆసుపత్రికి తరలించారు. వీరిలో 11 మంది గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. మరో 50 మంది గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ఇది దురదృష్టకర ఘటనగా దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం తీరుపై ఆగ్రహం..
ఎండ తీవ్రంగా ఉన్న విషయం తెలిసినప్పటికీ.. ప్రభుత్వం కనీస జాగ్రత్తలను తీసుకోలేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్త నీడ కల్పించాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి రాకపోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. శివసేన రెబెల్–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజలు అంటే ఎంత చులకనభావం అనేది ఈ ఘటనతో మరోసారి స్పష్టమైందని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు కూడా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.