Advertisements
Advertisements: డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. మా షోరూంకు రండి.. మిగతా షోరూంలతో పోల్చుకుండి. ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ కొనండి.. ఇలా ఆకర్షణీయ ప్రకటనలతో టీవీ చానెళ్లలోప్రకటనలు గుప్పించాడు.. గుప్పిస్తున్నాడు లలిత జ్యువెల్లర్స్ గుండు బాస్ కిరణ్కుమార్. ఇప్పుడు ఆయనకు ఓ పోటీదారు వచ్చాడు. స్వర్గసీమ వెంచర్ యజమాని చండ్ర చంద్రశేఖర్.. గుండుబాస్ కిరణ్కుమార్ను ఫాలో అవుతున్నాడు. రోజుకో రకమైన వేషధారణలో టీవీ ఛానెళ్లలో ప్రకటనలతో ముంచెత్తుతున్నాడు. మొన్నటి వరకు ఒకేరకమైన ప్రకటన ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతూ.. తమ వెంచర్లో స్థలం కొనాలని కోరుతున్నాడు.
ప్రకటనలతో లాభాలు..
వ్యాపార ప్రకటనల ప్రభావం ప్రజలపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారులకు, సినిమా హీరో హీరోయిన్స్కు భారీగా డబ్బులు ఇస్తుంటాయి వ్యాపార సంస్థలు. తమ బ్రాండ్ను ప్రమోట్ చేసుకుంటాయి. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులోని చాలా మంది వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు. మహేశ్బాబుతోపాటు సమంత లాంటి హీరోయిన్లు యాడ్స్లో మెరుస్తున్నారు. ఇక కొందమంది వ్యాపార సంస్థలను హీరోయిన్స్, యాంకర్స్, ఇతర ప్రముఖులతో ప్రారంభోత్సవం చేయించి వ్యాపారం పెంచుకుంటుంటారు.
సొంతంగా ప్రకటనలు..
అయితే లలితా జ్యువెల్లరీ యజమాని మాత్రం వాణిజ్య ప్రకటనల కోసం ఎవరిపైనా ఆధారపడలేదు. అనేక జ్వువెల్లరీ సంస్థలు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, కరీనా కపూర్, బాలకృష్ణలాంటి నటులతో ప్రకటనలు ఇస్తున్నాయి. లలితా జ్యువెల్లరి యజమాని కిరణ్కుమార్ మాత్రం తనను తానే నమ్ముకున్నాడు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనే ఒకే ఒక్క ఆకట్టుకునే డైలాగ్తో ఫేమస్ అయ్యాడు. వ్యాపారాన్ని కూడా పెంచుకున్నాడు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రాలో పలు పట్టణాల్లో షోరూంలు తెచిచాడు.
ఇప్పుడు చండ్ర చంద్రశేఖర్..
గుడు బాస్ కిరణ్కుమార్కు పోటీగా ఇప్పుడు చండ్ర చంద్రశేఖర్ వచ్చాడు. కిరణ్కుమార్ బాటలోనే ప్రయాణిస్తున్నాడు. కిరణ్కుమార్ కన్నా ఎక్కువ ప్రకటనలు ఇస్తున్నాడు. స్వర్గసీమ వెంచర్లో భూముల విక్రయించేందుకు ఒకరోజు రాజులా, ఒకరోజు మంత్రిలా, ఒకరోజు చెట్టుపై కూర్చొని, మరొకరోజు కౌబాయ్ గెటప్లో, ఇంకో రోజు సైకిల్పై వస్తూ, పతంగి ఎగురవేస్తూ.. నీతి సూత్రాలు చెబుతున్నాడు. ఆ నీతి సూత్రాలకు తమ వెంచర్ను లింక్ చేస్తున్నాడు. లలిత జ్యువెల్లరీ తరహాలోనే ఒక్కసారి మా వెంచర్ను సందర్శించండి.. తర్వాతే కొనండి అని కోరుతున్నాడు. వాణిజ్య ప్రకటల కోసం అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు గాయకులు బాలసుబ్రమణ్యం, మనో, దర్శకుడు విశ్వనాథ్, తనికెళ్ల భరణి, నాగబాబులాంటి వారితో ప్రకటనలు చేయించాయి. చంద్ర చంద్రశేఖర్ తన వెంచర్ కోసం తానే స్వయంగా ప్రకటనలు చేస్తున్నాడు. తను ప్రమోట్ చేసుకోవడంతోపాటు తన వెంచర్ను ప్రమోట్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.