Telangana New Secretariat : తెలంగాణ నూతన సచివాలయం నెలవారీ నిర్వహణ ఖర్చు అంతా? 

ఈ రాజకీయాలు పక్కన పెడితే సచివాలయ నిర్మాణమే కాదు నిర్వహణ ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తడిసి మోపెడు అయ్యేలా ఉంది.

Written By: Bhaskar, Updated On : April 30, 2023 9:34 am
Follow us on

Telangana New Secretariat : వాస్తు బాగోలేదని పాత సచివాలయాన్ని కూల కొట్టారు.. 1200 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించారు.. అది తెలంగాణకు రాజసం అని గొప్పలు పోతున్నారు. అమెరికా వైట్ హౌస్ లాగా ఉందని మురిసి పోతున్నారు. నచ్చిన పత్రికలకు కోట్లు కోట్లు జాకెట్ రూపంలో యాడ్స్ ఇస్తున్నారు. ఇదంతా డంబాచారం అని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించవచ్చుగాక.. ఈ రాజకీయాలు పక్కన పెడితే సచివాలయ నిర్మాణమే కాదు నిర్వహణ ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తడిసి మోపెడు అయ్యేలా ఉంది.
23 ఎకరాల్లో..
తెలంగాణ కొత్త సచివాలయాన్ని 23 ఎకరాల ప్రాంగణంలో ప్రభుత్వం నిర్మించింది.. సచివాలయం 10.5 లక్షల చదరపు అడుగులలో విస్తరించి ఉంది. చదరపు అడుగు కు పది రూపాయల చొప్పున నెలకు నిర్వహణ ఖర్చు కోటి రూపాయలు కానుంది. ఆరు అంతస్తులు నిర్మించిన ఈ భవనంలో చివరి అంతస్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి తో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిఏడి కార్యాలయాలు ఆరో అంతస్తులో ఉన్నాయి.
జనహిత హాల్
సీఎం కార్యాలయం పక్కనే ముఖ్యమంత్రిని కలిసేందుకు వీలుగా ప్రజా దర్బార్ కోసం జనహిత హాల్ ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 250 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. ముఖ్యమైన మంత్రి కేటీఆర్ కోసం మూడో అంతస్తు కేటాయించారు. ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలను పర్యవేక్షిస్తున్న కేటీఆర్.. ఆదివారం కొత్త సచివాలయం ప్రారంభం అనంతరం తన కార్యాలయంలోకి ప్రవేశిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మార్గదర్శకాలకు సంబంధించి తొలి ఫైల్ పై సంతకం చేస్తారు.
ఎవరెవరు ఉంటారంటే
కొత్త సచివాలయంలో ఏ ఏ చాంబర్లలో మంత్రులు కొలువు తీరుతారో ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంత్రులు చామకూర మల్లారెడ్డి, పుల ఈశ్వర్ కార్యాలయాలు ఉంటాయి. మొదటి అంతస్తులో హోం మంత్రి మహమ్మద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి కి కార్యాలయాల కేటాయించారు. రెండవ అంతస్తులో శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, హరీష్ రావు కార్యాలయాలు, మూడవ అంతస్తులు నిరంజన్ రెడ్డి, తారక రామారావు, సత్యవతి రాథోడ్, నాలుగవ అంతస్థులో ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, 5 అంతస్తులో వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కార్యాలయాలు ఉంటాయి. సచివాలయం భద్రతను పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 300 సీసీ కెమెరాలతో 24 గంటల పాటు బాధ్యతను పర్యవేక్షించనుంది. సచివాలయం ఏడవ అంతస్తులు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు.