Telangana Police: తెలంగాణలో పోలీస్ అధికారుల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇందుకు తగినట్లుగానే కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో విపక్ష నేతలు కూడా పోలీసులను ఖాకీ డ్రెస్ తీసేసి గులాబీ డ్రెస్ వేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయినా కొంతమంది పోలీసుల తీరు మారడం లేదు. ప్రమోషన్ల కోసమో.. బదిలీల కోసమో అధికార పార్టీకి సెల్యూట్ చేస్తూనే ఉన్నారు. విపక్షాలకు ఒక చట్టం.. అధికార పక్షానికి ఒక చట్టం అమలు చేస్తున్నారు. ఇక కొంతమంది అధికార పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ జిందాబాద్ కొడుతున్నారు. తాజాగా ఓ ఎస్సై అధికార పార్టీ కార్యక్రమలలో చివరకు గిన్నెలు కూడా మోయడం చర్చనీయాంశమైంది.
వంట గిన్నెలు మోసిన ఎస్సై..
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కౌండిన్య ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు హాజరై తమ ప్రభుత్వం చేస్తున్న చేస్తున్న కార్యక్రమాల గురించి గొప్పగా చెప్పుకున్నారు. మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అధికార పార్టీ కార్యక్రమానికి బందోబస్తు కోసం హుజూర్నగర్ ఎస్సై కట్టా వెంకటరెడ్డి వచ్చారు. సమావేశం జరుగున్నంత సేపు బందోబస్తు పర్యవేక్షించారు. కార్యక్రమం అనంతరం కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారా పార్టీ నేతల ప్రసన్నం కోసం ఎస్సై చివరకు వంట గిన్నెలు మోశారు. ఈ దృశ్యాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది. అలుసు ఇస్తున్నారని చివరకు ఇలా గిన్నెలు మోయించేస్థాయికి పోలీసులను దిగజార్చారు అధికార పార్టీ నేతలు.
ఎందుకింత దిగజారుతున్నారు..
పోలీసులు అధికార పార్టీ విషయంలో దిగజారి పోవడం చర్చనీయాంశమౌతోంది. యూనిఫాం పోస్టుకు ఉన్న పౌరుషం ఏమైందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మూడు సింహాలు తలెత్తుకుని ఉన్నా.. కనిపించే నాలుగో సింహం మాత్రం ఇలా అధికార పార్టీ ముందు తలవంచుకుంటోందని విమర్శిస్తున్నారు. కేవలం తమకు అనుకూలమైన ఠాణాల్లో పోస్టింగ్ కోసం, ప్రమోషన్ల కోసం ఇంతలా దిగజారాలా, ఊడిగం చేయాలా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్న విలువ కూడా తెలంగాణలో పోలీసులకు లేకుండా పోతోందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి మోకరిల్లే పోలీసులు ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తారని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.
అయితే అందరు పోలీసులు ఇలా ఉంటారని అనుకోవడం తప్పు.. తెలంగాణలో కూడా నిజాయతీ ఉన్న పోలీస్ అధికారులు, ఎన్నిసార్లు బదిలీ చేసినా వెళ్లి పనిచేసే వాళ్లు, పైరవీలు చేయకుండా పౌరుషంగా విధులు నిర్వహించే నాలుగో సింహం ఇంకా బతికే ఉంది అన్నది మాత్రం వాస్తవం. అయితే కొంతమంది తీరు ఆ డిపార్ట్మెంట్ మొత్తానికే మచ్చ తెస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More