
Chandrababu: కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది చంద్రబాబు పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. గెలవనని తెలిస్తే తనకు కూడా చంద్రబాబు పక్కన పెట్టేస్తారని ప్రకటించారు. ఈసారి ఎన్నికలు అంత అషామాషీగా ఉండవని చెబుతున్నారు. అయితే ఎక్కడికక్కడే సీనియర్లు చంద్రబాబుకు చికాకు తెప్పిస్తున్నారు. ఒక టిక్కెట్ తో వారు సరిపెట్టుకోవడం లేదు. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి టిక్కెట్లు డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తమ అనుచరులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. బలమైన ప్రత్యర్థి ఒక వైపు, పొత్తులతో సీట్ల పంపకాలు.. మిగిలిన సీట్లు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇటువంటి సమయంలో సీనియర్లు ఆయనకు దడ పుట్టిస్తున్నారు.
రాయపాటి అల్టిమేట్..
గుంటూరు వృద్ధ నేత రాయపాటి సాంబశివరావు చంద్రబాబుకు అల్టిమేట్ ఇచ్చినంత పనిచేస్తున్నారు. తన కుటుంబంలో మూడు టిక్కెట్లకు డిమాండ్ చేస్తున్నారు. కుదరకుంటే రెండు టిక్కెట్లు అయినా ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. తన ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని.. తన కుటుంబానికి మాత్రం రెండే కేటాయించాల్సిందేనంటూ కుండబద్ధలు కొడుతున్నారు. ఇస్తే మంచిది లేకుంటే తన ప్రతాపం చూపిస్తానని హెచ్చరికలు జారీచేసేదాక పరిస్థితి వచ్చింది. తన కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి కానీ.. పెదకూరపాడు కానీ ఏదో ఒక నియోజకవర్గం కేటాయించాలని కోరుతున్నారు.తమ్ముడు కూతురు శైలజకు ఒక టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు తనకు నరసారావుపేట ఎంపీ టికెట్ ఇస్తే చాలా సంతోషిస్తానని కూడా చెబుతున్నారు. ఎంత డబ్బులు కావాలంటే అంత ఖర్చుపెడతానని కూడా చంద్రబాబుకు ఆఫరిస్తున్నారు. అయితే ఈ సారి డబ్బుతో పనిలేకుండానే టీడీపీ గెలుస్తుందని వృద్ధ నేత అభిప్రాయపడుతున్నారు.
యనమల లాబీయింగ్..
ఇదిలా ఉంటే నరసారావుపేట ఎంపీ సీటు కోసం మరో సీనియర్ నాయకుడు యనమల రామక్రిష్ణుడు గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు. ఆయన అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కోసం ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన మహాష్ టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. కానీ రాయలసీమ జిల్లాలో కాకుండా నరసారావుపేట నుంచి దింపితే సేఫ్ అని రామక్రిష్ణుడు భావిస్తున్నారు. అయితే మహేష్ కి ఇవ్వవద్దంటూ రాయపాటి అల్టిమేట్ జారీచేస్తున్నారు. నాన్ లోకల్ పర్సన్ కు టిక్కెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. స్థానికత అంశం తెరపైకి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇద్దరు సీనియర్ల మధ్య చంద్రబాబు నలిగిపోతున్నారు. పంచాయితీని ఎలా తేల్చుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.

ఉత్తరాంధ్ర నేతలదీ అదే తీరు..
ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్లు సైతం కుటుంబ టిక్కెట్ల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కళా వెంకటరావును ఈసారి ఎంపీ బరిలో దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అశోక్ గజపతిరాజును విజయనగరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించి.. ఎంపీగా కళా వెంకటరావును రంగంలోకి దించాలని చూస్తున్నారు. కానీ కళా వెంకటరావు మాత్రం తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుకు ఎచ్చెర్ల అసెంబ్లీ సీటును కోరుతున్నారు. అయితే ఇప్పటికే కళా వెంకటరావు సోదరుడు కుమారుడు కిమిడి నాగార్జున చీపురుపల్లిలో అభ్యర్థి. దీంతో కుటుంబానికి మూడు టిక్కెట్లు అవుతాయని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే కళా మాత్రం తన రాజకీయ ప్రత్యర్థి అయిన కింజరాపు కుటుంబంలో అచ్చెన్నాయుడు కు ఎమ్మెల్యే. ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడుకు ఎంపీ, కుమార్తె భవానీకి ఎమ్మెల్యే సీటు ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అటు విశాఖకు చెందిన అయ్యన్నపాత్రుడు సైతం తనకు నర్సీపట్నం అసెంబ్లీ, తన కుమారుడు విజయ్ కు అనకాపల్లి ఎంపీ సీటుకు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎవరికీ హామీ ఇవ్వడం లేదు. కానీ ఎన్నికల ముందు సీట్ల పంపకాలతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.