Road Accident: కాళ్ల పారాణి ఆరకముందే.. దైవ దర్శనంలో విషాదం.. నవదంపతులు.. ఆ కుటుంబం బలి

సికింద్రాబాద్ లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా నల్లగట్ల హైవేపై నెమ్మదిగా వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది.

Written By: Dharma, Updated On : March 6, 2024 9:47 am

Road Accident

Follow us on

Road Accident: వారం రోజుల కిందటే కుమారుడికి వివాహం జరిగింది. రిసెప్షన్ వేడుకలు కూడా పూర్తయ్యాయి. నూతన వధూవరులతో ఆ కుటుంబం వెంకన్న దర్శనానికి వెళ్ళింది. తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటనలో నూతన వధూవరులతో పాటు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో జరిగిన ఈ ప్రమాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

సికింద్రాబాద్ లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా నల్లగట్ల హైవేపై నెమ్మదిగా వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో రవీందర్ తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్ కిరణ్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు.

ఇందులో బాల కిరణ్ కు కావ్యతో గత నెల 29న గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిగింది. ఈనెల 3న శామీర్పేట్ లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. 4 న నూతన దంపతులను తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృత్యువాత పడడాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారంతా పెద్ద ఎత్తున నంద్యాల చేరుకున్నారు.