Homeఆంధ్రప్రదేశ్‌Anam Ramanarayana Reddy: వైసీపీలో ఏకఛత్రాధిపత్యమే.. భజనపరులకే ప్రాధాన్యం

Anam Ramanarayana Reddy: వైసీపీలో ఏకఛత్రాధిపత్యమే.. భజనపరులకే ప్రాధాన్యం

Anam Ramanarayana Reddy
Anam Ramanarayana Reddy

Anam Ramanarayana Reddy: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న ఉద్దేశంతో బహిష్కరణకు గురైన నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుందని, ఆ పార్టీకి భజనపరులే కావాలని తీవ్ర విమర్శలు చేశారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన మొదటిసారి బహిష్కరణతో పాటు అనేక విషయాలపై మాట్లాడారు. గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఏనాడు ప్రజాస్వామ్య విలువలు ఇంతలా దిగజారలేదని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి రావడం దారుణమని చెప్పారు. ఎంతోమంది పెద్ద నేతలతో పనిచేశానని.. తాను ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. అనేక విషయాలు పై మాట్లాడిన ఆయన పరోక్షంగా సీఎం జగన్మోహన్ రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.

సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్లు..

ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచి ప్రశ్నిస్తూ వచ్చానని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రశ్నించే గొంతుక అంటే ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని సద్విమర్శగా తీసుకొని, మంచి చేసేందుకు ప్రయత్నం చేయాలి. కానీ అధికారంలోని పార్టీ ప్రశ్నించే గొంతుకు తొక్కేయడం. నలిపేయడం చేస్తోంది. రాష్ట్రంలో, ముఖ్యంగా మా జిల్లాలో జరిగే దోపిడీ వ్యవస్థలపై ప్రశ్నించాను. విమర్శించాను. అభివృద్ధి నిలిచిపోయిందని.. అరాచకాలు జరుగుతున్నాయని చెప్పాను. ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు జరగలేదని గత నాలుగు నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. అందుకే నన్ను పక్కన పెట్టి నా నియోజకవర్గంలో రాజ్యాంగ శక్తిని ఇన్చార్జిగా పెట్టారు. నాకు సహకరించవద్దని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సీఎం ఓ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. ఆఖరికి నా భద్రతను కూడా కుదించారు’ అని ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Anam Ramanarayana Reddy
Anam Ramanarayana Reddy

ప్రజాస్వామ్య విలువల తెలియని వ్యక్తులు..

ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తులతో నాలుగేళ్లు నడిచినందుకు బాధపడుతున్నానని రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మీరేమైనా అనుకోండి కానీ మేం అనుకున్నదే చేస్తాం అన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉందని విమర్శించారు. అటువంటి సలహాదారుల సలహాలతో నడిచే ప్రభుత్వం మనకూడా భవిష్యత్తులో ప్రశ్నార్ధకమవుతుందని స్పష్టం చేశారు. మేం అమ్ముడుపోయామంటే కొందరు చేసిన ఆరోపణలు మీడియాలో చూసామని, మాపై విమర్శలు చేసిన ప్రభుత్వ సలహాదారు వేలకోట్లు ఎలా సంపాదించారు మేం చూసామని స్పష్టం చేశారు. ఆయనలాగే అందరూ ఉంటారని అనుకుంటున్నారని, రాజకీయ జీవితంలో ఇలాంటి నిందలు, ఆరోపణలు సహజమని కొట్టి పారేశారు. మా గురించి తెలిసిన వారు వాటిని విశ్వసించరని, ఇలాంటి చిల్లర వ్యవహారాలకు మేము పాల్పడ్డామని భావిస్తే అది వాళ్ళ ఖర్మే స్పష్టం చేశారు.

క్రాస్ ఓటింగ్ ను నిర్ధారించడం సాధ్యం కాదు..

క్రాస్ ఓటింగ్ జరిగిందని నిర్ధారించడం సీక్రెట్ బ్యాలెట్ లో కాదని అనం స్పష్టం చేశారు. అంత పటిష్టమైన చట్టం ఉందని, మనల్ని విమర్శించే వారిని బయటకు పంపడం ఎలా అని ఆలోచించి ఈ విధంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. ‘మా ప్రభుత్వంలో అంతా ఏకఛత్రాధిపత్యమే. పూర్వం చక్రవర్తులు, రాజుల పాలన తరహా ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. భజనపరులు కావాలనుకునే మనస్తత్వం వారిది. రాజకీయ అహంకారపూరిత ధోరణితో ఉన్న వ్యవస్థలో మమ్మల్ని ఉంచుకోవడం వారికి ఇష్టం లేదు. ఇతర ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్య విలువలతో పాటు పార్టీలను వ్యక్తులను గౌరవించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా. నా కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి వస్తారు అనేది అప్పటి పరిస్థితులు బట్టి ఉంటుంది’ అని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

Exit mobile version