Nizamabad: దట్టమైన అడవిలో.. తండ్రి శవం పక్కన.. అర్ధరాత్రి ఒంటరిగా మూడేళ్ల బాలుడు.. అసలేం జరిగిందంటే?

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం వెంగల్ పాడ్ కు చెందిన మాలవత్ రెడ్డి (34)కి నితిన్ (3) అనే కుమారుడు ఉన్నాడు. అయితే 2023 జూన్ 21న మాలవత్ రెడ్డి తన మేనమామ చంద్రును యాచారం అనే గ్రామంలో దించేందుకు బైక్ పై బయలు దేరాడు.

Written By: Chai Muchhata, Updated On : July 5, 2023 10:49 am

Nizamabad

Follow us on

Nizamabad: అర్ధరాత్రి.. కారడవి.. ఒంటరిగా ఉండాలన్నా.. అక్కడికి వెళ్లాలన్నా ఎవరికైనా భయం ఉంటుంది. సాధారణ సమయంలోనే దట్టమైన ఫారెస్ట్ లో అడుగుపెట్టాలంటే వణుకుతాం.. అలాంటిది చిమ్మ చీకట్లో కారుకూత వినిపించని ప్రదేశంలో మూడేళ్ల బాలుడు ఒంటరిగా 10 గంటల పాటు ఉన్నాడు.. అదీ తన తండ్రి శవాన్ని పక్కన బెట్టుకొని ఏడుస్తూ కూర్చున్నాడు. చివరికి ఓ అర్చకుడు ఆ బాలుడిని గుర్తించడంతో విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో హూటాహుటికి అక్కడికి తరలివచ్చారు. రాత్రంతా చిమ్మచీకట్లో గడిపిన ఆ బాలుడిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం వెంగల్ పాడ్ కు చెందిన మాలవత్ రెడ్డి (34)కి నితిన్ (3) అనే కుమారుడు ఉన్నాడు. అయితే 2023 జూన్ 21న మాలవత్ రెడ్డి తన మేనమామ చంద్రును యాచారం అనే గ్రామంలో దించేందుకు బైక్ పై బయలు దేరాడు. తనతో పాటుగా తన కుమారుడు నితిన్ కూడా తీసుకెళ్లాడు. చంద్రును యాచారంలో దింపిన తరువాత తిరుగు ప్రయాణం చేశాడు. ఈ క్రమంలో ఆయన రాత్రి 8 గంటల సమయంలో దట్టమైన అడవిలోకి రావాల్సి వచ్చింది. ఇక్కడున్న ఓ దర్గా వద్ద మాలవత్ బైక్ బారికేడ్ కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాలవత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. నితిన్ మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో చుట్టుపక్కలా ఎవరూ లేదు. దట్టమైన అడవి కావడంతో అక్కడికి వచ్చే వారు కూడా లేదు. దీంతో తండ్రి మృతదేహం పక్కనే బాలుడు నితిన్ ఒంటరిగా ఉన్నాడు. ఇలా ఉదయం వరకు అక్కడే ఏడుస్తూ కూర్చోవడంతో ఓ అర్చకుడు అటువైపు వెళ్తుండగా నితిన్ ను గుర్తించాడు. అయితే అప్పటికే మాలవత్ రెడ్డికి కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. కానీ ఫోన్ లిప్ట్ చేసి మాట్లాడే అవగాహన నితిన్ కు లేదు. అయితే ఆలయ పూజారి మోగుతున్న ఫోన్ ను తీసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు గ్రామస్థులతో కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు.

రాత్రంతా తండ్రి శవం పక్కనే ఉన్న బాలుడిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఆర్జీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాలవత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడి పరిస్థితి తెలుసుకొని చలించిపోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దట్టమైన అడవిలో బాలుడు గడిపిన క్షణాలను ఊహించుకుంటేనే భయం వేస్తుంది.. అలాంటిది ఒంటరిగా ఎలా ఉన్నాడో? అని అనుకుంటున్నారు.