Cyber ​​Crime: ఘరానా సైబర్ మోసగాడు.. వందల కోట్లు కొల్లగొట్టాడు

పోలీసులకు చిక్కకుండా రోనాక్‌ ఎన్నో ఎత్తులు వేస్తుంటాడు. ‘కానూన్‌ కా హాత్‌ లంబా’ అన్నట్లుగా ఈ నెల 12న హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అతని ఆటను కట్టించారు. ముంబైలో అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తరలించారు.

Written By: Bhaskar, Updated On : August 22, 2023 6:03 pm

Cyber ​​Crime

Follow us on

Cyber ​​Crime: అతడు చూడటానికి సాధారణ వ్యక్తి లాగానే కనిపిస్తాడు. కానీ అతని వ్యవహార శైలి మాత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాలో కృష్ణకు మించి ఉంటుంది. రెప్ప పాటు కాలంలోనే ఎదుటివారిని మాటల్లో పెట్టడం.. వారి వద్ద నుంచి దొరికిన కాడికితో చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అలాగని అతడేమీ దొంగ కాదు. టెక్ పరి భాషలో చెప్పాలంటే సైబర్ మోసగాడు. కేవలం తన బుర్రలో ఉన్న మాయదారి ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి వందల కోట్లు దోచుకున్న మాయగాడు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్టుగా.. ఇటీవల ఇతడు పోలీసులకు చిక్కాడు. అతడిని విచారిస్తుండగా చెబుతున్న విషయాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

ఇతడి రూటే సపరేటు

ఇటీవల హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఘరానా సైబర్‌ మోసగాడు రోనాక్‌ భరత్‌ కక్కడ్‌ ను అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తుండగా చెబుతున్న విషయాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. వర్సిటీల్లో సీట్లు మొదలు.. ఉద్యోగాల దాకా, వ్యాపారాల పేరుతో టోకరా మొదలు.. షేర్‌ మార్కెట్‌లో కాల్స్‌ పేరుతో చీటింగ్‌ దాకా.. అన్ని రంగాల్లోనూ సైబర్‌ ప్రపంచంలో మోసాలకు పాల్పడడం ఇతని స్టైల్‌..! అంతేనా..? దేశవ్యాప్తంగా భారీ నెట్‌వర్క్‌ ఇతని సొంతం. ఆ నెట్‌వర్క్‌లో యాప్‌ డెవలపర్లు, సోషల్‌ మీడియా మేనేజర్లు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు.. ఇలా పలు రంగాలకు చెందినవారు ఉన్నట్లు తెలుసుకుని, పోలీసులే అవాక్కవతున్నారు. ఇదీ.. అదీ.. అని కాకుండా, నెటిజన్లు, ఉద్యోగార్థులు, విద్యార్థుల అవసరాలను సొమ్ము చేసుకునేలా రోనాక్‌ అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్నాడు.

ఉద్యోగాల పేరుతో..

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌, జాబ్‌సైట్స్‌, వర్సిటీల వెబ్‌సైట్ల నుంచి ఉద్యోగాలు, పార్ట్‌టైమ్‌ జాబ్స్‌, బిజినెస్‌, షేర్‌మార్కెట్‌, ఆన్‌లైన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ తదితర అంశాలపై ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరిస్తాడు. వారిని టెలిగ్రామ్‌ చానల్స్‌లో చేరుస్తాడు. అలా తన మోసాలకు తెరతీస్తాడు. నెటిజన్లు దేనికోసమైతే సెర్చ్‌ చేస్తుంటారో.. దాన్ని వెంటనే అందజేస్తామంటూ నమ్మబలుకుతాడు. టెలిగ్రామ్‌లో నకిలీ యాప్స్‌ లింకులు పంపి, క్రమంగా వేలు, లక్షలు కొల్లగొడతాడు. ఇలా దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా అమాయకులను బురిడీ కొట్టించి, రూ.500 కోట్లు దండుకున్నట్లు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు లెక్కతేల్చారు. ‘‘ఉద్యోగార్థులు, వ్యాపారులు, విద్యార్థులే కాదు.. కొన్ని కంపెనీలను కూడా రోనాక్‌ మోసగించినట్లు గుర్తించాం. అందుకోసం డార్క్‌వెబ్‌ను వాడుకుంటాడు. నకిలీ ఈ-మెయిల్స్‌ సృష్టించి, ఇతర దేశాల సంస్థలతో వ్యాపార ఒప్పందాలున్న దేశీయ సంస్థలను మోసగించి, కోట్లు దండుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కోవలో హైదరాబాద్‌కు చెందిన కొన్ని వ్యాపార సంస్థలు కూడా మోసపోయాయి. అంటే.. డార్క్‌వెబ్‌లోని యాప్స్‌ ద్వారా ఆయా సంస్థల పేరుతో ఈ-మెయిల్‌ ఐడీలు సృష్టిస్తాడు. నకిలీ ఈ-మెయిల్‌ ఐడీలతో ఆయా సంస్థల అకౌంట్స్‌ విభాగాలకు మెయిల్స్‌ పంపి, డబ్బులను కొల్లగొడతాడు. ఈ క్రమంలో తైవాన్‌, చైనాకు చెందిన అంతర్జాతీయ సైబర్‌ నేరగాళ్లతో రోనాక్‌ సంబంధాలను ఏర్పరుచుకున్నట్లు గుర్తించాం’’ అని పోలీసులు వివరించారు.

దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌

పోలీసులకు చిక్కకుండా రోనాక్‌ ఎన్నో ఎత్తులు వేస్తుంటాడు. ‘కానూన్‌ కా హాత్‌ లంబా’ అన్నట్లుగా ఈ నెల 12న హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అతని ఆటను కట్టించారు. ముంబైలో అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తరలించారు. ఆ వెంటనే జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించి, జైలుకు పంపారు. కోర్టు అనుమతితో మూడ్రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. రోనాక్‌ను విచారిస్తున్న కొద్దీ అవాక్కవ్వడం పోలీసుల వంతవుతోందంటే.. అతని మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా సైబర్‌ నేరగాళ్లు తమ పరిధి వరకే మోసాలకు పాల్పడతారు. అయితే.. రోనాక్‌ మాత్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న సైబర్‌ చీటర్లతో ఓ భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. భారతీయ భాషలు తెలిసిన సోషల్‌ మీడియా మేనేజర్లు(పెట్టుబడులు, వ్యాపారావకాశాలపై సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తుంటారు), టెలిగ్రామ్‌లో ఉద్యోగాలు, పార్ట్‌టైమ్‌ జాబ్స్‌పై ప్రచారం చేసేవారు మొదలు.. నకిలీ యాప్స్‌ తయారు చేసే టెకీలు, తాను పోలీసులకు ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టుబడకుండా ఉండేందుకు పోలీసుల్లా ఆలోచించే సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, హ్యాకర్లు ఇతని నెట్‌వర్క్‌లో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వారికి ఆకర్షణీయ ప్యాకేజీలు ఇస్తాడని పేర్కొన్నారు. మోసాల ద్వారా కొల్లగొట్టే కోట్ల రూపాయలను ఎప్పటికప్పుడు చైనా, తైవాన్‌ దేశాలకు తరలించేవాడని వివరించారు. ఒక్క తెలంగాణలోనే వందల సంఖ్యలో రోనాక్‌ బాధితులు ఉన్నట్లు తెలిపారు.

భారీ ముఠా

రోనాక్‌ను అరెస్టు చేయడంతో తమకు అతిపెద్ద ముఠా లీడ్‌ దొరికిందని సీసీఎస్‌ పోలీసులు చెబుతున్నారు. ఇతని నెట్‌వర్క్‌లో ఉన్న సైబర్‌ చీటర్లను పట్టుకోగలిగితే.. లక్షల మంది అమాయకులను మోసాల బారిన పడకుండా కాపాడినట్లవుతుందంటున్నారు. రోనాక్‌కు సహకరిస్తున్న సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, సోషల్‌ మీడియా మేనేజర్లు, యాప్‌ డెవలపర్లు పట్టుబడితే.. వారి ద్వారా గొలుసుకట్టు అరెస్టులు జరిగే అవకాశాలున్నాయని వారు వివరిస్తున్నారు.