Cyber ​​Frauds: ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోమన్నాడు.. బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయం చేశాడు..

జిల్లాలో సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా ఓటీపీలు, వాలెట్లు, యూపీఐల పేరుతో రెచ్చిపోతున్నారు. ప్రజల ఖాతాలోని సొమ్ము ఖాళీ చేస్తున్నారు. తాజాగా కథలాపూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఖాతాలోని రూ.99,670 కాజేశారు.

Written By: Raj Shekar, Updated On : March 8, 2024 12:18 pm

Cyber ​​Frauds

Follow us on

Cyber ​​Frauds: జగిత్యాల జిల్లాలో సైబర్‌ మోసాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. సాంకేతికరంగంలో వస్తున్న మార్పులను ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యులు ఇందులో చిక్కి విలవిలలాడుతున్నారు. పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా నేరాలు మాత్రం ఆగడం లేదు.

ఓటీపీలు, వాలెట్లు, యూపీఐ పేరిట..
జిల్లాలో సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా ఓటీపీలు, వాలెట్లు, యూపీఐల పేరుతో రెచ్చిపోతున్నారు. ప్రజల ఖాతాలోని సొమ్ము ఖాళీ చేస్తున్నారు. తాజాగా కథలాపూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఖాతాలోని రూ.99,670 కాజేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. దీంతో అతడు డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. తర్వాత ఓటీపీ వస్తుందని అది చెప్పాలని కోరాడు. దీంతో అతడు ఓటీపీ చెప్పాడు. అంతే, అతడి ఖాతా నుంచి మూడు దఫాలుగా రూ.99, 670 తస్కరించాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పరుగున వెళ్లి పోలీసుకు ఫిర్యాదు చేశాడు.

అవగాహన కల్పిస్తున్నా…
సైబర్‌ నేరాలపై రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు అవగాహన కల్పిస్తున్నారు. కళాజాత, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వివరిస్తున్నారు. ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. మోసం జరిగిందని గుర్తిస్తే డయల్‌ 100 లేదా టోల్‌ప్రీ నంబర్‌ 1930కి ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు. త్వరగా ఫిర్యాదు చేస్తే రికవరీకి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లకు వచ్చే లింకులు క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. బ్యాంకు నుంచి అని ఎవరైనా ఫోన్‌ చేసినా బ్యాంకులకు వెళ్లాలని పేర్కొంటున్నారు. అయినా చదువుకున్నవారు కూడా సైబర్‌ వలలో పడుతున్నారు.

ఫోన్‌ నంబర్ల ద్వారా..
వివిధ సందర్భాల్లో సమర్పించిన ఫోన్‌ నంబర్లను సైబర్‌ నేరగాళ్లు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకుల నుంచిఫోన్‌ చేస్తున్నామని కార్డు పనిచేయడం లేదని, ఖాతా నిలిచిందని నమ్మిస్తున్నారు. ఓటీపీలు తెలుసుకుని నగదు కాజేస్తున్నారు. ఫోన్‌ లింక్‌లు, షార్ట్‌ మెస్సేజ్‌లు పంపుతున్నారు. వాటిని క్లిక్‌ చేయగానే ఖాతా లూటీ చేస్తున్నారు. కొందరు గేమ్‌ యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. గిఫ్ట్‌లు, పార్ట్‌టైమ్‌ జాబ్‌ల పేరిట కూడా చాలా మంది మోసాలబారిన పడుతున్నారు.