Hyderabad: హైదరాబాద్లో వీధికుక్కల దాడులు ఆగటం లేదు. కుక్కల దాడిలో చిన్నారులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా.. షేక్పేట్లో తీవ్ర విషాదం నెలకొంది. కుక్కల దాడి చేసి ఐదు నెలల చిన్నారిని చంపేశాయి. 17 రోజుల క్రితం(డిసెంబర్ 8) చిన్నారి శరత్ను గుడిసెలో పడుకోబెట్టిన తల్లిదండ్రులు పనికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తీవ్ర గాయాలతో చిన్నారి పడి ఉన్నాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
సీసీ ఫుటేజీ చూసి షాక్..
కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు షాక్ అయ్యారు. వీధికుక్కలు గుడిసెలో చొరబడి చిన్నారిపై దాడి చేసినట్లు గుర్తించారు. తాజా ఘటనతో జీహెచ్ ఎంసీ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధికుక్కల బెడదను నివారణలో జీహెచ్ఎంసీ సిబ్బంది విఫలమవుతున్నారని, ఫలితంగా చిన్నారుల కుక్కలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనేక ఘటనలు..
గతంలోనూ నగరంలో పలుసార్లు వీధి కుక్కల దాడిలో చిన్నారులు గాయపడి, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో అంబర్పేటలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు నమోదు చేసుకొని జీహెచ్ఎంసీ అధికారుకు నోటీసులు ఇచ్చింది. అయినా.. వీధికుక్కలను నియంత్రించడంలో విఫలమవుతున్నారు. అధికారులు పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం లేదు.