Shameerpet Gun Firing: శామీర్పేట సెలబ్రిటీ అపార్ట్మెంట్లో మూడు రోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. సినీ నటుడు మామిడి మనోజ్కుమార్ నాయుడు అలియాస్ సూర్యతేజ.. తన బంధానికి అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో సిద్ధార్థదాస్ను హతమార్చేందుకు ప్రయత్నించాడని పోలీసులు నిర్ధారించారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు విషయాలు వెల్లడయ్యాయి.
కౌన్సెలింగ్ కోసం వచ్చి…
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన సిద్ధార్థ దాస్(49) ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్కు చెందిన స్మిత గ్రంథికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు(17), కుమార్తె(13) ఉన్నారు. ఇద్దరూ మూసాపేటలో నివాసముండేవారు. మనస్పర్థలతో 2019లో స్మిత విడాకులకు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తానుండే ప్రాంతానికి సిద్ధార్థ రాకుండా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవారు. ఆమె బుద్ధిజం పేరుతో మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ ఇచ్చేవారు. అదే సమయంలో మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న, విజయనగరం జిల్లా రాజాంకు చెందిన మనోజ్ ఫేస్బుక్ ద్వారా స్మితను సంప్రదించాడు. కౌన్సెలింగ్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే స్మిత తన వ్యక్తిగత జీవితాన్ని పంచుకోవడంతో ఇద్దరూ దగ్గరయ్యారు.
కలిసి వ్యాపారం..
భర్తతో వేరుగా ఉంటున్న స్మిత 2020లో ప్రశాంత్ అనే వ్యక్తితో కలిసి కన్సల్టెన్సీ సేవల సంస్థను ప్రారంభించారు. సంస్థ నుంచి ప్రశాంత్ వెళ్లిపోయాక స్మిత, మనోజ్ ఇద్దరూ కలిసి నిర్వహించారు. వచ్చిన లాభాలతో 2021లో శామీర్పేటలో సెలబ్రిటీ విల్లాలో ఇల్లు కొని అక్కడే కార్యాలయం నిర్వహిస్తూ, నివాసంగానూ ఉపయోగించేవారు.
ఇంటర్ ఫెయిల్ అయ్యాడని దాడి..
స్మిత ఇద్దరు పిల్లల చదువుల విషయంలో మనోజ్ కఠినంగా వ్యవహరించేవాడు. స్మిత కుమారుడు ఇంటర్లో ఫెయిలయ్యాడని మనోజ్ కొట్టాడు. దీంతో స్మిత కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితుల దగ్గర ఉంటున్నాడు. జులై 12న తనను మనోజ్ వేధిస్తున్నాడంటూ బాలల సంరక్షణ కమిటీకి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చాడు. తన చెల్లిల్ని కూడా వేధిస్తున్నారని తండ్రికి, సీడబ్ల్యూసీకి చెప్పాడు.
పిల్లల్ని చూసేందుకు వచ్చి..
ఈ క్రమంలోనే కుమార్తెను చూసేందుకు విశాఖలో ఉంటున్న సిద్ధార్థదాస్ శనివారం తెల్లవారుజామున శామీర్పేటలో స్మిత, మనోజ్ ఉండే నివాసానికి వెళ్లాడు. ఇదే అదనుగా సిద్ధార్థను హతమార్చి తమ బంధానికి అడ్డుతొలగించుకోవాలని మనోజ్ నిర్ణయించుకున్నాడు. తనకు స్నేహితుడు బహుమతిగా ఇచ్చిన ఎయిర్గన్తో సిద్ధార్థపై కాల్పులు జరిపాడు. సిద్ధార్థ అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకొని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అల్వాల్లోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపర్చగా రిమాండ్ విధించారు. వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి కారాగారానికి తరలించారు.