AI Anchor : వార్నీ అరె ఏంట్రా ఇదీ.. ఈ ఛానెల్ అతి టీవీ9 ను మించిపోయింది

ఆర్టిఫిషియల్ గా చెట్టు పడుతున్నట్టు ఎఫెక్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే.. దాని ధాటికి వణికిపోతున్నట్టు యాంకర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇది చూసిన జనాలకు బాబోయ్ ఇన్నాళ్లు టీవీ9 మాత్రమే అనుకున్నాం. ఇప్పుడు దాని మించేలాగా ఈ ఛానల్ ఉందని కామెంట్ చేస్తున్నారు.

Written By: Bhaskar, Updated On : July 21, 2023 6:53 pm
Follow us on

AI Anchor : మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. వార్తను వార్తలాగా చెప్పాలని. వార్తను వార్తలాగా చూపించాలని.. ఎక్స్క్లూజివ్ వార్తలుంటే.. ఇన్సైడ్ యాంగిల్ ఉంటే కొంత మసాలా జోడించవచ్చు. ఒకవేళ రాసిన జర్నలిస్టుకు చేయి తిరిగి ఉంటే మరి కొంత పోపు యాడ్ చేయవచ్చు. కానీ విషయమే వీకైనప్పుడు.. హంగామా ఎంత చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? వార్తను వార్తలాగా చెప్పకుండా హడావిడి చేస్తే జనాలకు ఏమాత్రం ఎక్కుతుంది? ఇంతా చేస్తే జనాలు ట్రోల్ చేయడం తప్ప.. ఏం ప్రయోజనం ఉండదు.. ఇంత ఉపోద్ఘాతం దేనికంటే అక్కడికే వస్తున్నాం ఆగండి..
తెలుగు నాట 19 సంవత్సరాల క్రితం టీవీ9 అనే ఒక 24 గంటల పాటు వార్తలను ప్రసారం చేసే ఛానల్ ఉద్భవించింది. మొదట్లో అది వార్తను వార్త లాగానే చూపించేది. చూసేవారికి కూడా నచ్చడంతో దానిని ఏకంగా నెత్తి మీద పెట్టుకున్నారు. మొదటి స్థానం అప్పగించారు. సాధారణంగా మొదటి స్థానంలో ఉన్న వారికి బరువుతో పాటు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. మొదట్లో టీవీ9 ఈ బరువు బాధ్యతలను బాగానే మోసింది. మధ్యలో ఏం పుట్టిందో తెలియదు గానీ పుట్టి మునిగే కాడికి తెచ్చుకుంది. రవి ప్రకాష్ ఆర్థిక వ్యవహారాలలో అవకతవకలకు పాల్పడటం,  మేనేజ్మెంట్ తరిమేయడం ఇందుకు బోనస్ పాయింట్లు. సరే మీడియాలో పెద్ద పెద్ద తలకాయల బతుకుల్లో ఎవరివి చూసుకున్నా నలుపే కాబట్టి.. టీవీ9 కు ఇందుకు మినహాయింపు ఇద్దాం. కానీ ఇవే మినహాయింపులు వార్తల విషయంలో ఇవ్వడం కుదరదు. ఎందుకంటే వాటిని జనం నేరుగా చూస్తారు కాబట్టి.. సమాజం ఎంతోకొంత ప్రభావితం అవుతుంది కాబట్టి.. ఈ విషయాన్ని మర్చిపోయి టీవీ9 రకరకాల ప్రయోగాలు చేస్తోంది. వార్తలకు బదులు కామెడీ చేస్తూ జనాలను నవ్విస్తోంది. టీవీ9 ఛానల్ ను చూసి తెలుగు నాట చాలా న్యూస్ ఛానల్స్ వాత పెట్టుకున్నాయి. కానీ ఈ ఛానల్ ఏంటో తెలియదు కానీ ఏకంగా మెడలో వేసుకుంది.
ఆమధ్య బిగ్ టీవీ అనే పేరుతో ఒక న్యూస్ ఛానల్ ప్రారంభమైంది. ఇది ఇంకా సాటిలైట్ దశలోనే ఉన్నట్టు సమాచారం. యూట్యూబ్లో మాత్రం కనిపిస్తోంది. సబ్స్క్రైబర్లు కూడా 10 లక్షల దాకా ఉన్నారు. ఆ మధ్యనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దక్షిణాదిలోనే మొదటిసారిగా వార్తలు చదివే మాయ అనే యాంకర్ ను ప్రవేశపెట్టింది. వాస్తవానికి ప్రయోగం టీవీ9 చేయాలి. కానీ అక్కడ ఉన్న యాంకరమ్మలు టీవీ9 పెద్దపెద్ద తలకాయల్ని మేనేజ్ చేయడంతో ఆగిపోయిందని టాక్. సరే మాయను ఎలాగూ ప్రవేశపెట్టామనే ఊపులో బిగ్ టివి క్రియేటివిటీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నది.. ఇవి ప్రయోగాలు అనేకంటే జబర్దస్త్ స్కిట్స్ అనడం సబబు. ఆ మధ్య శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోతే టీవీ9 ఛానల్ బాత్రూం టబ్ లో ఆమె ఏ విధంగా చనిపోయిందో ప్రాక్టికల్ గా చూపించింది. ఇది అభాసుపాలైన విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ టీవీ9 తన ప్రయోగాలు మానుకోలేదు. అతిదారిలో బిగ్ టివి కూడా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సందర్భంగా ఏకంగా వర్షాలు కురుస్తున్నట్లు బ్యాక్గ్రౌండ్ లో చూపించింది. వార్తలు చదువుతున్న యాంకర్ ఆస్కార్ లెవెల్ లో పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ గా చెట్టు పడుతున్నట్టు ఎఫెక్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే.. దాని ధాటికి వణికిపోతున్నట్టు యాంకర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇది చూసిన జనాలకు బాబోయ్ ఇన్నాళ్లు టీవీ9 మాత్రమే అనుకున్నాం. ఇప్పుడు దాని మించేలాగా ఈ ఛానల్ ఉందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.