Social Media Reels:  నీ సోషల్ మీడియా రీల్స్ పిచ్చి పాడుగాను.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నావ్ కదరా..

సోషల్ మీడియా వ్యసనం అయిపోయింది. ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోవాలని చాలామంది సోషల్ మీడియాను ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇదే క్రమంలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 15, 2024 10:42 am

Social Media Reels

Follow us on

Social Media Reels :  టిక్ టాక్ ను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇతర సామాజిక మాధ్యమాలు రీల్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దీంతో చాలామంది రీల్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అవి వారి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో రీల్స్ చేస్తూ ఓ యువతీ ఒక కొండ మీద నుంచి లోయలో పడిపోయి దుర్మరణం చెందింది. ఆమె వయసు పాతిక సంవత్సరాలు. పైగా సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా లో ఆమెకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకునేందుకు ఆమె ఇలాంటి పని చేయడం వల్ల దుర్మరణం చెందింది.. ఇక తన స్నేహితుడితో ఓ యువతితో కలిసి విహారయాత్రకు వెళ్లింది. తాను కార్ డ్రైవ్ చేస్తుండగా వీడియో తీయాలని సూచించింది. కార్ డ్రైవ్ చేస్తున్న వీడియోను రీల్స్ లాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని అతనితో చెప్పింది. దానికి అతడు కూడా ఓకే చెప్పాడు. అలా ఆమె కార్ డ్రైవ్ చేస్తుండగా పొరపాటున ఎక్సలేటర్ ను తొక్కింది. అంతే కారు వేగంగా పక్కనే ఉన్న కొండను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ యువత సోషల్ మీడియా రీల్స్ పిచ్చిని మానుకోవడం లేదు.

తాజాగా తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో రీల్స్ చేసేందుకు సమీపంలో నిలిపి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కాడు. అతడు రీల్స్ చేస్తుండగా రైలు పైన ఉన్న కరెంటు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డాడు. విద్యుత్ తీగలు తగలడంతో అతడి శరీరం 70% కాలిపోయింది. గమనించిన స్థానికులు అతడిని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. కీలకమైన అవయవాలు కాలిపోవడంతో అతడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు..” అతడు శరీరం 70% కాలిపోయింది. కీలకమైన అవయవాలు కూడా దెబ్బతిన్నాయి. చర్మం పూర్తిగా కాలిపోయింది. అంతర్గతంగా రక్తస్రావం కూడా తీవ్రంగా జరిగింది. ఇలాంటి సమయంలో అతడి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం.. అత్యవసర చికిత్స విభాగం లో అతడికి వైద్యం అందిస్తున్నాం. విద్యుత్ సరఫరా అధికంగా కావడంతో అతడి శరీరం తీవ్రంగా ప్రభావితం అయింది. కీలకమైన అవయవాలు వేడికి ప్రభావితం అవడం వల్ల సరిగా పనిచేయడం లేదు. అందువల్లే అతడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. అత్యవసర వైద్య విభాగంలో అతడికి చికిత్స అందిస్తున్నాం.. ఇంకా అతడికి అనేక శస్త్ర చికిత్సలు చేయాల్సి రావచ్చని” ఎంజీఎం వైద్యులు అంటున్నారు.