Suryapet: భారత దేశం కళలకు పుట్టినిల్లు.. శిల్ప కళలకు చిరునామా. వందల ఏళ్ల క్రితమే దేశాన్ని పాలించిన రాజులు తమ పాలనకు గుర్తుగా శిల్పాలు చెక్కించారు. ఆలయాలు, భవనాలు నిర్మించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. శిల్పకళా వైభవానికి పెట్టింది పేరు.. కాకతీయుల పాలన. కాకతీయుల చరిత్రలో తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. నేటికీ ఆ ప్రాంతాలు చరిత్రకు సజీవ సాక్షాలుగా ఉన్నాయి. కానీ, నాటి కాలంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న కట్టడాలు అక్కడక్కడ దర్శన మిస్తున్నాయి. కాకతీయులు వారి అవసరాల కోసం చెరువులు, నీటి బావిలను నిర్మించుకున్నారు. పలు ప్రాంతాల్లో మెట్లబావులు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. అయితే కొన్నింటికి మాత్రం చాలా చరిత్ర ఉంటుంది.
సూర్యపేటలో అరుదైన కట్టడాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట పేరు చెప్పగానే నిజాం నిరంకుశ పాలనలో జరిగిన మారణ హోమం తోపాటు వీర తెలంగాణ సాయుధ పోరాటం అందరికీ గుర్తుకొస్తుంది. అంతకు పూర్వం కాకతీయుల కాలంలో నిర్మించిన కట్టడాలు, ఆలయాలు, బావులు దర్శనమిస్తుంటాయి. తాజాగా సూర్యాపేట ప్రాంతంలో 1300 ఏళ్లనాటి మెట్ల బావి, 1200 ఏళ్ల క్రితం నాటి గణపతి విగ్రహం వెలుగు చూశాయి. ఆత్మకూరులో పురావస్తు శాఖ అధికారులు జరిపిన పరిశోధనలో ఇలాంటి మెట్లబావి బయట పడింది. పురాతన చెన్నకేశవ చెన్నకేశవ స్వామి ఆలయం లోపల నలువైపులా నిర్మాణాలను పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు ఇది అపురూపమైన చారిత్రక ఆలయంగా పేర్కొన్నారు.
16వ శతాబ్దం నాటి విగ్రహం..
ఆలయంలో కొలువై ఉన్న చెన్నకేశవ స్వామి విగ్రహం క్రీస్తు శకం 16వ శతాబ్దం నాటిదని, మహామండపంలో ఇరువైపులా ఉన్న అల్వార్ విగ్రహాలు 18వ శతాబ్దం నాటివని తేల్చారు. ఆలయంలో రాతి స్తంభాలతో ఉన్న ముఖ మండపం కూడా 18 శతాబ్దం నాటిదని చెప్పారు. 18వ శతాబ్దంలో నిర్మించిన మెట్ల భావికి 13 శతాబ్దం నాటి కాకతీయ స్థంబాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్తంభాలపై ఉన్న శృంగారపు శిల్పాలు చరిత్రను ధ్రువీకరిస్తున్నాయని తెలిపారు. నిర్మాణం జరుపుకొని 1300 సంవత్సరాలు కావడంతో శిధిలావస్థకు చేరిన మెట్ల వరుసలు వంకరులు తిరిగి, కొన్నిచోట్ల భూమిలోకి కుంగిపోయినట్లుగా ఉన్నాయి. మెట్ల బావికి పక్కనే ఉన్న సత్రపు మండపం కూడా అక్కడక్కడ కుంగుబాటుకు గురైంది. ఈ మెట్లబావి ఎంతో పురాతమైనదిగా పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.
అబ్బురపరిచే గణపతి విగ్రహం..
ఇక పురావస్తు శాఖ అన్వేషణలో ఆత్మకూరులోనే 1200 ఏళ్ల క్రితం నాటి గణపతి విగ్రహం గుర్తించారు. ఈ గణపతి విగ్రహం ఎనిమిదవ శతాబ్దం నాటిదిగా గుర్తించారు. 120 సంవత్సరాల చరిత్ర ఈ విగ్రహానికి ఉందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. చాళుక్య రాజుల కాలంలో నల్లశానపు రాతిలో చెక్కిన రెండు చేతులు కలిగిన, తలపై కిరీటంలేని విగ్రహంగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన దొరవారి బావిలో 40 ఏళ్ల క్రితం పూడికతీత సందర్భంగా ఈ భారీ విగ్రహం దొరికిందని గ్రామసలు చెబుతున్నారు.
ఏటా వినాయక చవితి ఉత్సవాలు..
అప్పట్నుంచి స్థానిక యువకులు వినాయక చవితి ఉత్సవాలకు గణపతి విగ్రహాన్ని ముస్తాబు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు, పురావస్తు పరిశోధకుడు ఈమని శివ నాగిరెడ్డితో కలిసి మెట్ల బావితోపాటు చెన్నకేశవ ఆలయాన్ని మంత్రి జగదీశ్రెడ్డి సందర్శించారు. మెట్ల బావికి పూర్వ వైభవానికి బావిని పునరుద్ధరించడానికి మంత్రి జగదీశ్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే పూడికతీత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. చారిత్రక గణపతి విగ్రహం రోడ్డుకు మూడు అడుగుల లోతులో ఉన్న వినాయక విగ్రహాన్ని పనరుద్ధరణ చర్యలో భాగంగా ఎత్తు ప్రదేశంలో ప్రతిష్టించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More