Revanth Reddy latest decision: గ్రామపంచాయతీలు ఆర్థికంగా బలంగా ఉంటేనే దేశం బాగుంటుంది. ఎందుకంటే మన దేశానికి పల్లెలే పట్టు కొమ్మలు కాబట్టి. దురదృష్టవశాత్తు గ్రామీణ ప్రాంతాలను ఇప్పటికి ప్రభుత్వాలు కేవలం ఆదాయం వచ్చే వనరులుగానే చూస్తున్నాయి. ఆదాయాన్ని తీసుకొని అంతంతమాత్రంగా కేటాయింపులు జరుపుతూ.. అభివృద్ధి విషయంలో శీత కన్ను ప్రదర్శిస్తున్నాయి. అందువల్లే గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా పోతున్నాయి. తెలంగాణలో గడచిన పది సంవత్సరాల కాలంలో గ్రామపంచాయతీలపై భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం విపరీతమైన పెత్తనం సాగించింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. దీంతో పంచాయతీలలో బకాయిలు పేరుకుపోయాయి.
పంచాయతీల మీద ట్రాక్టర్లు.. ఇతర ఖర్చులను వేయడంతో.. బకాయిలు గుదిబండ లాగా మారిపోయాయి. దీంతో కనీసం పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వచ్చే ఆదాయం మీద హక్కు లేకుండా పోయింది. ఫలితంగా ఎప్పుడో ఒకసారి కార్మికులకు వేతనాలు ఇస్తున్న దుస్థితి ఏర్పడింది. బకాయిలు పెరిగిపోవడం.. ఆర్థిక వృద్ధి లేకపోవడంతో పంచాయతీలు తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి స్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ చరిత్రలోనే సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు.
ఇకపై వచ్చే ఆదాయాన్ని పంచాయతీ బ్యాంకు ఖాతాలలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖజానా లో వేసి తీసుకునే పద్ధతి ఉండదు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తున్నారు. పంచాయతీలలో పనిచేసే సిబ్బందికి ఒకటవ తేదీన వేతనాలు వస్తాయి. రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పంచాయతీలలో పనిచేస్తున్న యాభై వేల మందికి ఊరట లభిస్తుంది. ఇకపై ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతినెల 50 కోట్ల వరకు పంచాయతీలకు వెళ్తాయి.
గత ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థలను మొత్తం నిర్వీర్యం చేసేందుకు ట్రెజరీ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిని మార్చేందుకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 70 (3) ని పూర్తిగా సవరించారు. దీనివల్ల ట్రెజరీలో పంచాయతీ ఆదాయాన్ని వేయాల్సిన అవసరం లేదు. పంచాయతీల పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలో వేసి తీసుకోవచ్చు. వేతనాలు.. ఇతర చెల్లింపులకు వాడుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఆడిట్ పరిధిలో ఉంటాయి. ప్రతి పైసా కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
మరోవైపు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. కేంద్రం ఇచ్చే నిధులు మొత్తం నేరుగా పంచాయతీలకే మంజూరు చేస్తుంది. ప్రభుత్వం కూడా తన వాటాగా డబ్బులు ఇస్తోంది. దీనివల్ల స్థానిక సంస్థలు బలోపేతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీలలో పనిచేసే కార్మికులకు అంతంత మాత్రం గానే వేతనాలు ఉంటాయి. ఆ వేతనాలు పకడ్బందీగా వస్తేనే వారి అవసరాలు తీరుతాయి. ఆ విషయాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్ చట్టంలో పూర్తిగా మార్పులు తీసుకొచ్చారు. దీనివల్ల ఉద్యోగులకు వేతనాలు మాత్రమే కాదు.. పంచాయతీ కూడా ఆర్థికంగా బలోపేతం అవుతాయి. అతి త్వరలోనే నూతన విధి విధానాలు అమలవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
