Raghav Chadha BJP Entry: ఇటీవల కాలంలో దేశ పార్లమెంటులో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా విస్తృతంగా ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు.. మరే పార్టీ ఎంపీ కూడా ఈ స్థాయిలో ప్రశ్నించిన దాఖలాలు కనిపించడం లేదు. టెలికాం కంపెనీల మోసాల నుంచి మొదలు పెడితే.. ప్రభుత్వ పనులలో జాప్యం వరకు ప్రతి విషయంలోనూ ప్రశ్నిస్తూనే ఉన్నాడు రాఘవ్. దీంతో అతని గురించి జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇన్ని సంవత్సరాలకు ప్రశ్నించే గొంతుక పార్లమెంట్ లో ప్రజా సమస్యల మీద మాట్లాడుతోందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.
రాఘవ్ పార్లమెంట్లో ప్రశ్నించిన తీరును సాధారణంగా మరో పార్టీ అయితే కచ్చితంగా నెత్తిన పెట్టుకునేది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అతడు ప్రశ్నిస్తున్న తీరును పట్టించుకోలేదు. పైగా అతడిని పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు అన్నట్టుగా ప్రవర్తించింది. కొన్ని సందర్భాలలో అతని గురించి మాట్లాడటం అనవసరమని ఆ పార్టీ నాయకులు చెప్పడం విశేషం. పార్టీ అధినాయకత్వం రాఘవ్ ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో అతడు తన రాజకీయ ప్రయాణాన్ని మరో విధంగా మొదలుపెట్టాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే బిజెపి అధినాయకత్వం అతనికి టచ్లోకి వెళ్ళింది. అంతే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
ఆప్ నుంచి రాఘవ్ బిజెపిలో చేరిపోయారు. ఒక రకంగా అతడి నిర్ణయం ఆ పార్టీ అధినాయకత్వానికి షాక్ లాగా అనిపించింది. అతడు పార్టీలో చేరడం మాత్రమే కాదు.. కేంద్ర మంత్రి పదవి కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కేంద్ర మంత్రి అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రజల సమస్యల మీద రాఘవ్ కీలకంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వినియోగదారుల నుంచి టెలికాం కంపెనీలు అడ్డగోలుగా వసూలు చేయడం.. వినియోగించని డాటాను కస్టమర్ల ఖాతాలో జమ చేయలేకపోవడం.. అనవసరమైన చార్జీలు వినిపించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆయన ప్రశ్నిస్తున్న తీరు పట్ల యావత్ దేశం మొత్తం ఆసక్తిగా గమనించింది. సోషల్ మీడియాలో అతనికి సపోర్ట్ గా ఇప్పటికీ ఒక ఉద్యమం నడుస్తూనే ఉంది. అయితే రాఘవ్ వ్యవహరిస్తున్న తీరు ఆప్ అధినాయకత్వానికి ఇబ్బందిగా అనిపించినట్టు తెలుస్తోంది. అందువల్లే అతడికి అంతగా సపోర్ట్ ఇవ్వడం లేదు. దీంతో రాఘవ్ కూడా బిజెపిలో చేరాలని అనుకున్నారు. తన సమ్మతిని బిజెపి అధినాయకత్వానికి వెల్లడించారు. అతడి వ్యవహార శైలి నచ్చిన బీజేపీ అధినాయకత్వం అతడి రాక పట్ల సుముఖత వ్యక్తం చేసింది. ఒకవేళ రాఘవ్ కేంద్ర మంత్రి అయితే.. ప్రజల సమస్యలపై మరింత గొప్పగా తన వాయిస్ వినిపిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.