KCR Vs Revanth Reddy: రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు.. అధిష్టానం వద్ద పెరిగిన పలుకుబడి.. కేరళ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తాను చేసిన ప్రచారానికి లభించిన గౌరవం.. చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. అందువల్లే ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు.
2034 వరకు తానే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటానని.. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని ఆయన స్పష్టం చేశారు. 2034 తర్వాత తాను దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోతానని పేర్కొన్నారు. దీంతో రేవంత్ గురించి కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అంతగా వ్యతిరేకతలేదు. అలాగని గుడ్డి సానుకూలత కూడా లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సన్న ధాన్యానికి బోనస్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అడ్వాంటేజ్ గా మారిపోయాయి. ఇది రేవంత్ రెడ్డిని గ్రామీణ స్థాయిలో తిరుగులేని హీరోగా నిలబెడుతోంది.
కట్టు తప్పిన ఆర్థిక పరిస్థితి.. అప్పుల భారం పెరిగిపోవడం.. చెల్లింపుల ఒత్తిడి ఎక్కువ కావడం.. కొంతమంది మంత్రులు ఇష్టారాజ్యం.. భూములు.. ఇతర వ్యవహారాలలో కలగజేసుకోవడంతో సహజంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతోంది. దీనికి తోడు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తే.. ఏ మంత్రి కూడా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. చివరికి ముఖ్యమంత్రి రంగంలోకి దిగి తనను తాను సెల్ఫ్ డిపెండ్ చేసుకుంటున్నారు.. ఇంతేగాక.. కొంతమంది నాయకుల నోటి దురుసు.. ప్రభుత్వాన్ని ప్రజల ముందు పలుచన చేస్తోంది.
జగిత్యాల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆయన చేరిక సందర్భంగా జగిత్యాల ప్రాంతంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో కెసిఆర్ రేవంత్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే కేసీఆర్ తనదైన శైలిలో ఆరోపణలు చేయడం విశేషం. సహజంగానే గులాబీ పార్టీకి సోషల్ మీడియాలో బలం ఉంది. ఒక వర్గం మీడియా కూడా ఆ పార్టీకి భజన చేస్తోంది.
కెసిఆర్ జగిత్యాల సభ తర్వాత.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోతాయని అందరూ అనుకున్నారు. కాకపోతే ఊహించినట్టుగా అలా జరగడం లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన సపోర్ట్ లభించడం లేదు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తాను 2034 వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. అంతేకాదు భారత రాష్ట్ర సమితికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని శపధం చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఆత్మ విశ్వాసం ఉండాలి.. కానీ అతి విశ్వాసం ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగిత్యాల సభ తర్వాత కెసిఆర్ సైలెంట్ అయిపోయారని.. ఇదే అదునుగా రేవంత్ రెడ్డి వైలెంట్ గా ప్రవర్తిస్తున్నారని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు.. అయితే కెసిఆర్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారా.. ఇంకా ఏమైనా ప్రణాళికలు రూపొందిస్తున్నారా.. అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం అధిష్టానం ఇవ్వదు. ఎందుకంటే పార్టీని మించి వ్యక్తులు ఎదిగిపోతే కాంగ్రెస్ అధిష్టానం తట్టుకోదు. పీవీ నరసింహారావు ఉదంతమే ఇందుకు బలమైన నిదర్శనం. పైగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వలస బ్యాచ్ నిండిపోయిందని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పైగా ముఖ్యమంత్రి తీరుపై కొంతమంది మంత్రులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసినట్టు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి తన పలుకుబడి పెంచుకోవడంతో.. అధిష్టానం కూడా సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 2034లో ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా.. అది సాధ్యమవుతుందా.. పైగా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అధికంగా ఉంటాయి.
2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేక రకాలుగా మల్లగుల్లాలు పడింది. చివరికి ఓ నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. అలాంటప్పుడు 2034 వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా.. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మిగతా నాయకులు అలానే ఉండిపోతారా.. అసలే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు వారు గనుక కెసిఆర్ కు టచ్ లోకి వెళ్తే.. పరిస్థితి ఏంటి.. అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి అనుకున్నంత ఈజీగా ఉండదని.. ఆయన ఏ విశ్వాసంతో అయితే చెప్పారో.. దానిని చివరి వరకు కొనసాగించాలని.. లేనిపక్షంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని కేసీఆర్ అన్నట్టుగానే.. రేవంత్ రెడ్డి “2034” టార్గెట్ ఉంటుందని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
