Prakasam District Tragic Accident: అది మాటలకు అందని విషాదం. గుండెలు పగిలే దుఃఖం. ఇంకా తెల్లవారకముందే.. చాలామంది నిద్రలోనే దుర్మరణం చెందారు. మంటల తాకిడికి సజీవ దహనమయ్యారు. ఏపీలో జరిగిన ఈ దారుణం కన్నీరు పెట్టిస్తోంది. సరిగ్గా కొద్ది నెలల క్రితం కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు కాలిపోయిన సంఘటనను మర్చిపోకముందే.. ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం.
Also Read: ఇజ్రాయెల్లో వేలాది కాకులకు ఏమైంది.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయి? వినాశనమేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో పట్టణంలోని రాయవరం సమీపంలో పలకల క్వారీ వద్ద ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ను ఢీకొట్టింది. దీంతో ఒకసారిగా మంటలు ఏర్పడ్డాయి. దీంతో ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులు చూస్తుండగానే సజీవ దహనం అయిపోయారు.
ఈ బస్సు జగిత్యాల నుంచి కనిగిరి వెళుతున్నది. విపరీతమైన వేగంతో వెళుతున్న నేపథ్యంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సహాయక చర్యలను ముమ్మరం చేసినప్పటికీ ప్రాణనష్టాన్ని నివారించలేకపోయారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు. అయితే చాలామందికి గాయాలు అయిన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రమాదానికి అదే కారణం
ప్రైవేట్ ట్రావెల్ బస్సు విపరీతమైన వేగంతో ఉన్నట్టు తెలుస్తోంది. అదే వేగంతో పలకల క్వారీల వద్ద మలుపులు తిరుగుతుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. టిప్పర్ కూడా అధికమైన వేగంతో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
బస్సు కాలిపోతున్న నేపథ్యంలో వెనుక భాగంలో ఉన్నవారు ముందుకు రాలేక కన్నుమూసినట్టు సమాచారం. బస్సు ముందు భాగంలో ప్రయాణిస్తున్న పదిమంది ప్రయాణికులు మాత్రమే తమ ప్రాణాలను కాపాడుకున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువగా కనిగిరి ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఘటన స్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు.