TGPSC Group-1 Exam : గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయా? లేదా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత జరుగుతున్న గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవైపు అభ్యర్థుల ఆందోళన, మరోవైపు జీవో 29 రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పరీక్షలు జరుగుతాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : October 20, 2024 12:46 pm

TGPSC Group-1 Exam

Follow us on

TGPSC Group-1 Exam : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచాయి. రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్ల వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రూప్‌ –1, 2, 3, 4 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నిరుద్యోగులను గత ప్రభుత్వం మోసం చేసిందన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికలకు ఏడాది ముందు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022లో గ్రూప్‌–1, 2, 3, 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే పరీక్షల నిర్వహణలో అప్పటి టీఎస్‌పీఎస్సీ పూర్తిగా విఫలమైంది. ఒకసారి ప్రశ్నపత్రాల లీకేజీ, ఇంకోసారి పరీక్షల నిర్వహణలో వైఫల్యం, ఇంకోసారి షెడ్యూల్‌ ప్రకటనలో జాప్యం ఇలా వివిధ కారణాలతో మూడునాలుగుసార్లు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఎన్నికలు వచ్చాయి. అప్పటికే ప్రభుత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులో.. బీఆర్‌ఎస్‌ను గద్ద దించారు. కాంగ్రెస్‌ను గెలిపించారు. దీంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చి.. పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఫిబ్రవరిలో గ్రూప్‌–1 కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే బీఆర్‌ఎస్‌ జారీ చేసిన జీవో 55 ప్రకారం కాకుండా, జీవో 29 ప్రకారం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ప్రిలిమ్స్‌ వరకూ జీవో 29పై ఎలాంటి అభ్యంతరాలు తెలుపని అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత జీవో 29పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా పరక్ష నిర్వహణకు క్లియరెన్స్‌ ఇచ్చింది. దీంతో అభ్యర్థులు రోడ్లెక్కారు. పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జీవో 29 రద్దు చేయాలని కోరుతున్నారు. హైకోర్టులో ఊరట లభించని నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరుపనుంది. మరోవైపు సోమవారం నుంచే పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు జరుగుతాయా, లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

జరుగుతాయంటున్న సీఎం..
గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం సోమవారం(అక్టోబర్‌ 21)నుంచి జరుగుతాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం అభ్యర్థుల్లో 95 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. మిగిలినవారు కూడా పరీక్షలకు హాజరవ్వాలని సూచించారు. లేదంటే విలువైన అవకాశం కోల్పోతారని హెచ్చరించారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో మంత్రులు శనివారం అర్ధరాత్రి వరకూ చర్చించారు. జీవో 29తో అభ్యర్థులకు జరుగుతున్న నష్టంపై పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ కూడా ఆరా తీశారు. జీవో 55, జీవో 29కి ఉన్న తేడాను స్పష్టంగా చెప్పాలని నిర్ణయించారు. ఈ విషయంపై ఆదివారం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పరీక్షలు మాత్రం వాయిదే వేయొద్దని డిసైడ్‌ అయింది.

కోర్టు తీర్పుపై ఉత్కంఠ.
ఇదిలా ఉంటే.. సోమవారం ఉదయం 10:30 గంటలకు జీవో 29 రద్దుపై దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠగా మారింది. ప్రిలిమ్స్‌ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటలకు మెయిన్‌ పరీక్ష ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జోక్యానికి నిరాకరిస్తుందా.. లేక వాయిదా వేయాలని ఆదేశిస్తుందా అన్నది ఇటు అభ్యర్థులను, అటు ప్రభుత్వాన్ని టెన్షన్‌ పెడుతోంది.