Telangana Municipal Elections Results: మున్సిపల్ ఎన్నికల్లో తొలి మున్సిపాలిటీని బీర్ఎస్ కౌవసం చేసుకుంది. గడ్డపోతారంలో 18 వార్డులు ఉండగా, ఇక్కడ 14 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం గెలిచారు. దీంతో తొలి బల్దియా బీఆర్ఎస్ ఖాతాలో పడింది. ఇక రెండో మున్సిపాలిటీ నందికొండ కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఇక్కడ 12న వార్డులు ఉండగా, 11 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ ఒక వార్డులో విజయం సాధించింది. హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది.
మూడు వార్డుల్లో నువ్వా నేనా..
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, వైరా, కల్లూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. వైరాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో రెండు వార్డుల్లో విజయం సాధించాయి. మిగత వార్డుల్లో కూడా ఆధిక్యం ఇరు పార్టీల మధ్య దోబూచులాడుతోంది. ఇక్కడ ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తోంది. మూడు వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కో వార్డులో విజయం సాధించాయి. యాదగిరి గుట్టలో కాంగ్రెస్ 4, బీజేపీ ఋ స్థానంలో గెలిచింది.
కాంగ్రెస్ ఆధిక్యం..
ఇప్పటి వరకు ఫలితాల సరళి పరిశీలిస్తే ఓవరాల్గా కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఉదయం 10 గంటల వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ 135 వార్డులు గెలవగా, బీఆర్ఎస్ 61, బీజేపీ 20 వార్డుల్లో విజయం సాధించింది.
సీసీఐ బోణీ..
ఇదిలా ఉంటే.. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ బోణీ కొట్టింది. సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ పోటీ చేసింది. అయితే గెలుపుపై పెద్దగా అంచనాలు లేవు. ఖమ్మం, బెల్లంపల్లిలో కొన్ని సీట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే మంచిర్యాల జిల్లాలో అనూహ్యంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని అభ్యర్థులను బరిలో దించింది. దీంతో క్యాతనపల్లిలో బోణీ కొట్టింది.