Telangana Municipal Election: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదయింది. శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ గెలుపు పై ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. అయితే కొన్ని సంస్థలు అధికార కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చూపిస్తుందని ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెల్లడించాయి.
ఈ ఎన్నికల్లో తమకు అనుకూలమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో అధికార పార్టీ నాయకుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వెల్లడైన కొన్ని స్థానాలలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అంతేకాదు ఇంకా ఎక్కువ స్థానాల్లో కూడా అనుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాలలో అనుకూలమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో గాంధీభవన్ వద్ద సందడి వాతావరణం ఏర్పడింది. కార్యకర్తలు నినాదాలు చేస్తూ.. పటాసులు కాల్చుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు.. ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మున్సిపాలిటీగా సిరిసిల్ల నిలిచింది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఎమ్మెల్యే కేటీఆర్. గతంలో కేటీఆర్ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు. ఒకరకంగా షాడో ముఖ్యమంత్రిగా కనిపించారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితికి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో.. సిరిసిల్ల మున్సిపాలిటీ మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓ వార్డులో ఓటర్లకు ఓ అభ్యర్థి బంగారు నాణేలు పంపిణీ చేశాడు. దీంతో ఓటర్లు బంగారం అంటూ మురిసిపోయారు. అయితే రాగి నాణేల కు బంగారు పూత పూసి ఇచ్చారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఈ సంఘటన వెలుగులోకి రాగా.. ఇప్పుడు ఎన్నికల ఫలితాల సమయంలో కూడా చర్చకు రావడం.. కొంతమంది ఓటర్లు బహిరంగంగానే ఈ విషయంపై తీవ్రస్థాయిలో మాట్లాడారు. దీంతో సిరిసిల్ల మున్సిపాలిటీ కాస్త రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. సదరు అభ్యర్థి ఎన్నికల్లో గెలవడం కోసమే బంగారు నాణేలు ఇస్తున్నానంటూ ప్రచారం చేసుకున్నాడని.. చివరికి రాగి నాణేలు ఇచ్చినట్టు తేలడంతో ఓటర్లు మండిపడుతున్నారు.