Telangana Cabinet Ministers : రాష్ట్రానికి సంబంధించి పరిపాలన సాగించే సచివాలయంలో అందరి మంత్రులకు.. అధికారులకు పేషీలు ఉంటాయి. ముఖ్యమంత్రికి విశాలవంతమైన ఛాంబర్ ఉంటుంది. దానికి తోడు అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. దానిద్వారా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్.. ఇతరత్రా అంశాలను చర్చిస్తారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇది కొనసాగుతోంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కేవలం కేవలం ఎల్ఈడి స్క్రీన్ ల ద్వారానే ఈ వ్యవహారాలను సాగించేవారు.
కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. నాడు ప్రగతిభవన్లో.. ఆ తర్వాత కొత్త సచివాలయంలో కేసీఆర్ ఈ సదుపాయాన్ని కల్పించుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాటి కెసిఆర్ మాదిరిగానే అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ నుంచి వివిధ రకాల వ్యవహారాలు సాగిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను దీని ద్వారానే పరిశీలిస్తున్నారు. ఈ ఎల్ఈడి స్క్రీన్ ద్వారానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల మహిళా సంఘాల నేతలతో ముఖ్యమంత్రి ఇలానే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు..
ముఖ్యమంత్రి వరకైతే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ సచివాలయంలో ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలోనే సదుపాయాలు కోరుకుంటున్నారు. ఈ విషయం భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా వింగ్ ద్వారా బయటికి వచ్చింది. ఇది ఆరోపణ లేదా వాస్తవంగా జరిగిందేనా అనే విషయాలను పక్కన పెడితే.. మొత్తానికి అయితే ఆ ఇద్దరు మంత్రుల వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ఆ ఇద్దరు మంత్రులు తమకు సొంతంగా ఎల్ఈడి స్క్రీన్లు కావాలని.. ముఖ్యమంత్రి స్థాయిలోనే తమకు సదుపాయాలు కల్పించాలని కోరారు.
వాస్తవానికి ఆ మంత్రుల ఛాంబర్ లో ఎల్ఈడి టీవీలు ఉన్నాయి. ఇతర మంత్రులు కూడా అటువంటి టీవీల ద్వారానే తమ శాఖలకు సంబంధించిన వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. కానీ ఈ ఇద్దరు మంత్రులు మాత్రం భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలోనే తమకు కూడా అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఉండాలని.. సదుపాయాలు కూడా కల్పించాలని ఒత్తిడి తీసుకురావడంతో.. అధికారులకు తప్పలేదు. తట్టుకోలేక ఆ ఇద్దరు మంత్రులకు కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటికోసం భారీగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇంత ఖర్చు పెట్టి ఆ స్థాయిలో సదుపాయాలు ఏర్పాటు చేస్తే.. ఆ మంత్రులు వాటి ద్వారా సాగించే వ్యవహారాలు కూడా అంతంత మాత్రమేనని తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో సదుపాయాలు కోరుకున్న ఆ మంత్రులు.. భవిష్యత్తు కాలంలో ఏం చేస్తారో తెలియడం లేదని సచివాలయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
