Rahul Gandhi: జర్నలిజం.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. ప్రజలకు, పాలకులకు మధ్య జర్నలిస్టులు వారధిగా ఉంటూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సింది జర్నలస్టులే. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సింది జర్నలిస్టులే. అయితే రెండు మూడు దశాబ్దాలుగా జర్నలిజం కూడా రంగు మార్చుకుంటోంది. రాజకీయ పార్టీలకు అనుగుణంగా మారిపోయింది. అధికారంలో ఏ పార్టీ ఉంటే.. వారికి వత్తాసు పలకడం మొదలు పెట్టింది. ఆర్థిక ఇబ్బందులు, వాణిజ్య ప్రకటనల కోసం ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయి. విలువలకు వలువలు వదులుతున్న మీడియా సంస్థల యజమానులు తయారయ్యారు. తప్పును ఒప్పు చేసి.. ఒప్పును తప్పు చూపుతున్నారు. తమదే అసలు సిసలు జర్నలిజం అని భ్రమింపజేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా జర్నలిజం పుట్టుకు వచ్చింది. మీడియా సంస్థల స్వార్థాన్ని పసిగట్టిన ప్రజలు సోషల్ మీడియా వేదికగా వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నారు. నిర్ణయాన్ని ప్రజలకే వదిలేస్తున్నారు సోషల్ మీడియా ఇప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతోప్రజలంతా సోషల్ జర్నలిస్టులుగా మారిపోతున్నారు. ఇదిలా ఉంటే.. వివిధ యాజమాన్యాల పరిధిలో నడిచే మీడియాలో పనిచేసే జర్నలిస్టులు యాజమాన్యాల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి చిక్కుల్లో పడుతున్నారు. కొన్నిసార్లు వేధింపులు, దాడులకు గురవుతున్నారు. అండగా ఉండాల్సిన యాజమాన్యాలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో జర్నలిస్టులే పోరాటం చేయాల్సి వస్తోంది. తాజాగా ఓ జర్నలిలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణలోని స్వతంత్ర జర్నలిస్టులు ఆందోలనకు దిగారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఇంటి ఎదుటే ధర్నా చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ దాడులపై నిరసన..
తెలంగాణలో రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని జర్నలిస్టులు తెలిపారు. రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చి వీధుల్లో ప్రేమను పంచుతా అన్నారు.. కానీ పరిస్థితులు అలా లేవని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని వచ్చామని తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు పనిచేయడం లేదన్నారు. అలా చేస్తే తమపై కేసులు పెట్టుకోవచ్చన్నారు. దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు వస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకు దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి పరిస్థితి తెలిపేందుకు ఢిల్లీ వచ్చామని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ డీజీపీకి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. తాము ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేయడం లేదని, ప్రజాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న స్వతంత్ర జర్నలిస్టులం అని జర్నలిస్టు శంకర్ వీణవంక ప్రభాకర్ సుంకరి ప్రవీణ్ లింగస్వామి తదితరులు తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులకు రక్షణ లేదా..
ఇదిలా ఉంటే.. గతంలో బీఆర్ఎస్ పాలనలో స్వతంత్ర జర్నలిస్టులపై దాడులు జరిగేవి. పాలకులకు వ్యతిరేకంగా వార్తలురాసినా, కథనాలు ప్రసారం చేసిన ఆ పార్టీ నాయకులు మీడియా సంస్థలపై దాడులు చేసేవారు. ధ్వంసం చేసేవారు. పోలీసులు కూడా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా మార్పు వస్తుందని జర్నలిస్టులు భావించారు. కానీ, కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ సంప్రదాయాన్ని కొనసాగిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.