Telangana Police : తెలంగాణ పోలీసుల ఆపరేషన్ రాజస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు

ఆ మధ్య కార్తి హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఖాకీ అనే ఓ సినిమా వచ్చింది గుర్తుందా.. అందులో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ ముఠా గ్రామాల మీద పడి అడ్డగోలుగా దోచుకుంటుంది. ఒక ఆధారం కూడా విడిచిపెట్టకుండా అరాచకం సృష్టిస్తుంది. అలాంటి ఆ ముఠాను కార్తీ ఆధారాలతో పట్టుకుంటాడు. కటకటాల వెనక్కు పంపిస్తాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 1, 2024 8:40 pm

Telangana Police

Follow us on

Telangana Police : అదంటే సినిమా కాబట్టి కాస్త లిబర్టీస్ ఉంటాయి. కానీ రియల్ లైఫ్ లో అలాంటి సంఘటన జరిగింది. చదువుతుంటే ఆశ్చర్యం అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. జేబు తెలియకుండా పర్స్ కొట్టేసే థియరీని సైబర్ దొంగలు విజయవంతంగా అమలు చేస్తున్నారు. అయితే సైబర్ నేరగాళ్ల బారిన పడి కేవలం నిరక్షరాస్యులు మాత్రమే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. డబ్బులను నష్టపోతున్నారు. షేర్ మార్కెట్ అని, క్రిప్టో కరెన్సీ అని, మీ ఇంట్లో మాదకద్రవ్యాలు ఉన్నాయని.. ఇలా రకరకాల కారణాలు చెప్పి సైబర్ మోసగాళ్ళు మోసం చేస్తున్నారు. ఇందుకోసం మ్యూల్ ఖాతాలు వాడుకుంటున్నారు. అలా డబ్బును ఆ ఖాతాల్లోకి మళ్లించుకుని.. ఆ తర్వాత డ్రా చేసుకుంటున్నారు. పోలీసులు రెస్పాండ్ అయ్యేలోపు తమ పని సులభంగా కానిచ్చేస్తున్నారు.. అయితే ఇటీవల తెలంగాణ సైబర్ పోలీసులకు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో.. కొంతకాలంగా వారు సీరియస్ గా దృష్టి సారించారు. ఈ మోసాలు ఎక్కడ నుంచి జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి? సైబర్ మోసగాళ్లు నగదును ఏ ఖాతాల మీదుగా తమ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు? అనే విషయాలపై పోలీసులు క్షుణ్ణంగా పరిశోధన సాగించగా మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిశాయి.

అయితే ఈ మోసాలన్నీ కూడా రాజస్థాన్ కేంద్రంగా జరుగుతున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా వారు పరిశోధన చేస్తుండగా వెళ్లడైన వివరాల ఆధారంగా ఆపరేషన్ రాజస్థాన్ నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ రూపాయలలో సైబర్ నేరాలకు పాల్పడిన 27 మంది నేరగాళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా బ్యాంక్ చెక్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.. అయితే వీరంతా కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అమాయకులను బురిడీ కొట్టించి, లేని పోనీ భయాలను సృష్టించి నగదు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు సమాచారం. అయితే వారి వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే ఈ నేరాలకు పాల్పడుతున్న వారంతా టెక్నాలజీపై విపరీతమైన పట్టు ఉన్న వారిని పోలీసులు చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అయితే తెలంగాణ ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని అత్యున్నతంగా ఆధునికీకరించడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు డబ్బును తస్కరించకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారు డబ్బులు డ్రా చేయకుండా బ్యాంకు ఖాతాలోనే ఫ్రీజ్ చేయించగలుగుతున్నారు.. సైబర్ పోలీసులు ఇలా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ.. మోసగాళ్లు మాత్రం తమ నేరాలను తగ్గించడం లేదు. పైగా కొత్త కొత్త రూపాలలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.