Nagarjuna : సినీ నటీనటులు అక్కినేని నాగచైతన్య- సమంత విడాకులు తీసుకోవడం వెనుక మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ట్విట్టర్ వేదికగా కొండా సురేఖను ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. “కొండా సురేఖ గారు.. గౌరవ నీయ మంత్రివర్యులు. వారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినీ ప్రముఖులు రాజకీయాలకు దూరంగా ఉంటారు. మీ ప్రత్యర్ధులను విమర్శించడానికి మమ్మల్ని వాడుకోకండి. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను దయచేసి గౌరవించండి. మహిళగా మీరు బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నానని” నాగార్జున సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానించారు. ఇటీవల రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టింది. అప్పుడు కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొండా సురేఖ తన కుమారుడి విడాకుల విషయాన్ని ప్రస్తావించడంతో.. ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.
వాస్తవానికి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో చర్చకు దారితీసాయి. అయితే ఇటీవల మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొండా సురేఖ మెడలో నేత కార్మికులు తయారుచేసిన నూలు పోగు దండలో మెడలో వేశారు. ఆ ఫొటోను కొంతమంది భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేశారు. దీనిపై కొండా సురేఖ ఇటీవల కంటతడి పెట్టారు. దీని వెనక కేటీఆర్ ఉన్నాడని సురేఖ బలంగా నమ్ముతున్నారు. అందువల్లే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. మొత్తానికి సురేఖ కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. కేవలం నాగచైతన్య – సమంత విడాకుల వ్యవహారాన్ని మాత్రమే కాకుండా.. తెలుగు సినీ పరిశ్రమలో కేటీఆర్ ఎన్నో వ్యవహారాలు చేశాడని సురేఖ విమర్శించడం చర్చకు దారి తీస్తోంది. మరో వైపు ఈ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. రాజకీయాల్లోకి సినీ నటులను ఎందుకు లాగుతారని ప్రశ్నించారు. సినీ నటులకు వ్యక్తిగత జీవితాలు ఉంటాయని.. వాటిని రాజకీయ లక్ష్యాల కోసం వాడుకోవద్దని హితవు పలికారు. సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల భారత రాష్ట్రపతి నాయకులు స్పందిస్తున్నారు. ఆమె తీరు పట్ల మండిపడుతున్నారు.. మంత్రి హోదాలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు.
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. #justasking https://t.co/MsqIhDpbXa
— Prakash Raj (@prakashraaj) October 2, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More