Sri Rama Navami 2026: మనదేశంలో.. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో ఒక మనిషి పేరుకు ముందు ఇంటి పేరు ఉంటుంది. ఆ తర్వాత కులం.. అనంతరం గోత్రం ఉంటుంది.. ఇది ఇప్పటిది కాదు.. తరతరాలుగా సాగుతూ వస్తోంది. కులాన్ని.. గోత్రాన్ని కొంతమంది వ్యతిరేకించినప్పటికీ.. చాలామంది నేటికీ అనుసరిస్తూనే ఉంటారు..
కులాలు.. గోత్రాలు కేవలం మనుషులకు మాత్రమే కాదు.. దేవతామూర్తులకు కూడా ఉంటాయి. దేవతామూర్తులకు కులాలను.. గోత్రాలను ఆపాదించడం ఈనాటిది కాదు.. దాని వెనక ఏళ్ల చరిత్ర ఉంది. ఆయా దేవుళ్లను వివిధ కులాలవారు ఆపాదించుకోవడం పరిపాటిగా మారింది.
ఇప్పటివరకు కులాలు.. గోత్రాల విషయంలో ఏ దేవుళ్ళు కూడా ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. వివాదాస్పదమైన సందర్భాలు కూడా లేవు. అయితే తొలిసారిగా ఇటువంటి ఇబ్బందులు శ్రీ సీతారామ చంద్రుడు ఎదుర్కొంటున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. సీతారామ చంద్రుడికి ఆస్థాయిలో ఇబ్బంది ఎందుకు కలిగింది.. గోత్రం విషయంలో స్వామివారు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కారు.. ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
భద్రాద్రి రామయ్య గోత్రం వశిష్ట. సీతమ్మది గౌతమస గోత్రం. ఈ గోత్రాల పేర్లను చదువుతూ అర్చకులు పూజలు చేస్తూ ఉంటారు. 2012 తర్వాత పండితులు స్వామివారిని అచ్యుత.. అమ్మవారిని సౌభాగ్య గోత్రాలుగా చదువుతున్నారు. ఈ మార్పు వెనుక ఉద్దేశం ఏమిటో తెలియదు. అయితే సీతారామ చంద్రుల గోత్రాలను 2012 నుంచి మార్చి చదువుతున్నారని ఓ భక్తుడు కోర్టు దాకా వెళ్లాడు.
2022లో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు ఒక కమిటీ ఏర్పాటు అయింది. ఆ కమిటీ దేవాదాయ శాఖకు నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదికను దేవాదాయ శాఖ బయట పెట్టలేదు. దీంతో ఆ వ్యక్తి మళ్ళీ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ సున్నితమైన వివాదంపై కోర్టు ఎలా విచారిస్తుంది? ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది.
సీతారామచంద్రస్వామికి మరో మూడు రోజుల్లో కళ్యాణం.. మరో నాలుగు రోజుల్లో పట్టాభిషేకం జరుగుతాయి. ఇంతటి మహత్కార్యాల ముందు స్వామివారు గోత్రానికి సంబంధించి వివాదం ఎదుర్కోవడం.. అది కూడా కోర్టు దాకా వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్వామివారి గోత్రాలను మార్చి ఎందుకు చదువుతున్నారు.. గతంలో చదివిన వాటిని ఎందుకు పక్కన పెట్టారు.. అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లభించలేదు.
