Bhupalpally incident
Bhupalpally Incident : మేడిగడ్డ కుంగుబాటుకు గురికావడాన్ని ఆయన సహించలేకపోయారు. అందువల్లే కెసిఆర్ కు, హరీష్ రావుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు. అటువంటి వ్యక్తి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్ధులు ఆయనను కత్తులతో పొడిచి అంతమొందించారు. ఈ ఘటనపై అతని కుటుంబీకులు ఆందోళనకు దిగారు.. భూపాలపల్లి జిల్లా చెందిన రాజలింగమూర్తి సామాజిక కార్యకర్తగా పనిచేస్తుంటాడు. సమాజ హితం అంటే అందరికి చాలా ఇష్టం. అయితే అటువంటి వ్యక్తి భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. మేడిగడ్డ కుంగుబాటుకు గురైనప్పుడు కోర్టులో కేసు వేసింది ఇతనే. బహుశా రాష్ట్రంలో ఎవరు కూడా ఈ విషయంపై దృష్టి సారించనప్పుడు.. ఇతడే ప్రత్యేకంగా చొరవ తీసుకొని.. కీలక ఆధారాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కెసిఆర్, హరీష్ రావును ప్రతివాదులుగా పేర్కొన్నాడు. అయితే అటువంటి రాజలింగ మూర్తిని ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. కత్తులు, గొడ్డళ్లతో నరికి అంతమొందించారు. అయితే రాజలింగమూర్తి పై గతంలో వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగి పోవడానికి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కారణమని రాజలింగ మూర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసీఆర్, హరీష్ రావు కు కోర్టు నోటీసులు అందించింది. రాజలింగమూర్తి భూపాలపల్లి జిల్లాలో ఉన్న అనేక వివాదాలలో జోక్యం చేసుకునేవారని తెలుస్తోంది. బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు కత్తులతో, ఇతర మారణాయుధాలతో రాజలింగమూర్తిని హత్య చేశారని తెలుస్తోంది.. హత్యకు గురైన రాజలింగమూర్తి భార్య గతంలో భారత రాష్ట్ర సమితి తరపున వార్డ్ కౌన్సిలర్ గా గెలిచారు. 2019లో జరిగిన పురపాలక ఎన్నికల్లో భూపాలపల్లిలోని 15వ వార్డు నుంచి ఆమె భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేసి కౌన్సిలర్ గా గెలిచారు. అయితే ఆమె గెలిచిన కొద్ది నెలలకే భారత రాష్ట్ర సమితి నుంచి బహిష్కరించారు..
రాజలింగమూర్తి బుధవారం తన స్వగ్రామమైన జంగేడు శివారు ప్రాంతమైన పకీరు గడ్డలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్ళాడు. అక్కడినుంచి తిరిగి తన ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డును అతడు దాటుతుండగా దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురైదుగురు పాల్గొన్నారు. వారంతా కూడా మంకీ క్యాప్ లు ధరించారు. ఒకసారిగా కత్తులతో, మారణాయుధాలతో నరికారు. రాజలింగమూర్తికి తలకు బలమైన గాయాలయ్యాయి. ఉదరం నుంచి అంతర్గత అవయవాలు బయటికి వచ్చాయి. స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే అతడు కన్నుముశాడు. రాజలింగమూర్తి వరంగల్ నగరానికి చెందిన ఓ న్యాయమూర్తి ద్వారా భూ వివాదాలను పరిష్కరించే వాడని తెలుస్తోంది. అయితే అతడిపై అనేక కేసులు ఉన్నాయని సమాచారం. అంతేకాదు సింగరేణి తవ్వుతున్న ఓపెన్ కాస్ట్ గనుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని భావించి.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా రాజలింగమూర్తి ఫిర్యాదు చేశాడు. మరోవైపు రాజలింగమూర్తి హత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్య, వార్డ్ మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని అతని భార్య సరళ ఆరోపించింది. రాజలింగమూర్తి హత్యకు గురైన అనంతరం.. భూపాలపల్లి లోని అంబేద్కర్ కూడలిలో జాతీయ రహదారిపై సరళ కుటుంబ సభ్యులతో ఆందోళన చేసింది. పోలీసులు కల్పించుకొని.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె తన ఆందోళన విరమించింది. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Social activist nagavelli raja lingamurthy murder in bhupalpally
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com