Singareni: విస్తారంగా బొగ్గు.. తవ్వుకుంటే కోట్లే కోట్లు. అదే పని కొన్ని సంవత్సరాలుగా సింగరేణి చేస్తోంది.. విస్తారంగా ఉన్న బొగ్గును తవ్వుకున్నది. అక్కడ బొగ్గు అయిపోయింది. గుట్టలుగా పోసిన మట్టి.. ఆకాశాన్ని తాకుతోంది. సింగరేణి విధి బొగ్గు తవ్వుకోవడం మాత్రమే కాదు.. అంతకుమించి.. దానినే ఇప్పుడు చేసి చూపించింది. అది కాస్త ప్రశంసలకు అర్హమైనదిగా మారిపోయింది.
సాధారణంగా భూమిలో ఒక విత్తును నాటితే అది మొలకెత్తుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న ఆకులను కూడ తీసుకొని చెట్టుగా ఎదుగుతుంది. ఇలా ఎదిగిన చెట్లు భూమికి రక్షణగా ఉంటాయి. భూమిలో పెరుగుతూ సమస్త మానవాళికి గాలి.. నీడ.. ఆవాసం.. ఆహారం అందిస్తాయి. పారిశ్రామికీకరణ వల్ల అడవులను పెంచడం కాదు కదా.. నరకడం పెరిగిపోయింది. దీనికి సింగరేణి మినహాయింపు కాదు. సింగరేణి బొగ్గు కోసం ఎన్నో అడవులను నరికింది. ఎన్నో అడుగుల లోతు తవ్వకాలు జరిపింది. భూమి గర్భంలో ఉన్న బొగ్గును తవ్వింది. సొమ్ము చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఓపెన్ కాస్ట్ గనుల్లో తవ్వి తీసిన ఓవర్ బర్డన్ గుట్టలుగా పేరుకుపోయింది. సింగరేణికి వచ్చిన ఒక ఆలోచన సమస్తం ఓవర్ బర్డన్ రూపు రేఖలను మార్చేసింది.
బెల్లంపల్లి ఏరియాలో డోర్లీ ప్రాంతంలో గతంలో సింగరేణి బొగ్గును తవ్వితీసింది. అక్కడ బొగ్గు అయిపోవడంతో ఆ గని మొత్తాన్ని మూసేసింది. దాదాపు 162 హెక్టార్ల ప్రాంతంలో ఒక అడవిని సృష్టించింది. అంతేకాదు దీనికోసం సింగరేణి డిపాజిట్ చేసిన 40 కోట్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. డోర్లీ 2 మాత్రమే కాదు, డోర్లీ 1 ప్రాంతంలో కూడా సింగరేణి ఇదేవిధంగా మొక్కలు పెంచింది. అది కూడా అడవిలాగా మారిపోయింది. దీని ద్వారా కూడా 60 కోట్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక నిబంధన తీసుకొచ్చింది. మైనింగ్ ప్రారంభం.. బొగ్గు వెలికితీత.. ఆ తర్వాత మూసివేత విషయంలో అనేక ప్రమాణాలను తెరపైకి తీసుకొచ్చింది. దీనికోసం కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఎదుట కొంత డబ్బు డిపాజిట్ చేయాలని నిబంధన విధించింది. ప్రమాద ప్రకారం గని మూసివేత పూర్తయిన తర్వాత.. ఆ డబ్బులు తిరిగి ఇస్తోంది. బెల్లంపల్లి ఏరియాలో కూడా ఇదే జరిగింది. డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ కు 2013, 14 కాలంలో అనుమతులు వచ్చాయి. 2023, 24 కాలంలో మూతపడింది. దీనికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆడిట్ జరిపింది. ఈ వ్యవహారం మొత్తంలో సంతృప్తి వ్యక్తం చేసింది. ఫలితంగా సింగరేణి కి ప్రశంస లభించింది.
ఓవర్ బర్డెన్ మీద సింగరేణి ఏకంగా గ్రీన్ బెల్టులు ఏర్పాటు చేసింది. జల కాలుష్యం ఉండేందుకు అతి పొడవైన డ్రైనేజీలు ఏర్పాటు చేసింది.. చెక్ డ్యాములు కూడా నిర్మించింది. బురద నీరు వల్ల కాలుష్యం జరగకుండా ఏర్పాటు చేసింది. సెటిలింగ్ ట్యాంకులు నిర్మించింది.. మైన్ లో నుంచి వచ్చే నీటిని శుభ్రం చేసి సమీపంలో ఉన్న కాలువలకు వదిలింది. గని చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అక్కడ ఏర్పాటుచేసిన భవనాలను అత్యంత జాగ్రత్తగా తొలగించింది.
