Rohit Reddy Farmhouse Party SIT Investigation: తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన మాదకద్రవ్యాల పార్టీకి సంబంధించి కీలక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ సాగిస్తున్న క్రమంలో విస్మయకర వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మొదట్లో ఈ వ్యవహారం వెనక దుబాయ్ ఆస్తులు.. బినామీ వ్యక్తులు ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే అంతకుమించిన దారుణమైన నిజాలు ఈ వ్యవహారం వెనుక ఉన్నాయని సమాచారం.
Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!
ఈ పార్టీకి మాదక ద్రవ్యాలను సరఫరా చేసిన అభిషేక్ సింగ్ ప్రస్తుతం మహేశ్వరం ఎస్ఓటి పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయనను శంషాబాద్ తరలించారు. అక్కడ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ సాగిస్తున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అభిషేక్ సింగ్ ను పోలీసులు విచారించారు. రోహిత్ రెడ్డి, అభిషేక్ మధ్య అనేక పర్యాయాలు మాదకద్రవ్యాల కొనుగోలు జరిగినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణలను కూడా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. బ్యాంకు ఖాతాల ఆధారంగా రోహిత్ రెడ్డి భారీగానే నగదును అభిషేక్ కు బట్వాడా చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఐదు వీకెండ్ పార్టీలలో అభిషేక్ రోహిత్ రెడ్డికి మాదక ద్రవ్యాలను సరఫరా చేసిన సమాచారం. గతంలో 14 సార్లు.. వీకెండ్ పార్టీలు కలుపుకొని మొత్తం 19 సార్లు రోహిత్ రెడ్డి కి అభిషేక్ మాదకద్రవ్యాలను సరఫరా చేసినట్టు సమాచారం.
వ్యవసాయ క్షేత్రంలో జరిగిన పార్టీలో రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ కు అభిషేక్ నిషేధిత మత్తు పదార్థం అందించిన సమాచారం. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారుల విచారణలో ఇదే తేలింది. అభిషేక్ కు భారీగా నెట్వర్క్ ఉందని.. అందులో చాలామంది కస్టమర్లు ఉన్నారని సమాచారం.
అభిషేక్ ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడని.. అతడు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని.. గోవా, బెంగళూరు ప్రాంతంలో ఉన్న నైజీరియన్ వ్యక్తుల వద్ద నిషేధిత మత్తు పదార్థాలను కొనుగోలు చేసి
.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలు.. వీకెండ్ పార్టీలకు సరఫరా చేస్తాడని సమాచారం. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి.. బాబిలోన పబ్ నిర్వాకుడు అర్జున్ రెడ్డికి.. నిషేధిత మత్తు పదార్థాలను అభిషేక్ అందించినట్టు తెలుస్తోంది. అభిషేక్ కాల్ లిస్టులో ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. అతని కస్టమర్లపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన పార్టీలో పాల్గొన్న వ్యక్తుల వివరాలను కూడా సిట్ సేకరించినట్టు తెలుస్తోంది. రోహిత్ రెడ్డికి మాత్రమే కాకుండా కౌశిక్ రవితో కూడా అభిషేక్ కు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది..
రోహిత్ రెడ్డి పార్టీ వ్యవహారంలో మరో వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. రోహిత్ రెడ్డికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో కొంత భాగాన్ని ఏలూరు ప్రాంతానికి చెందిన మరవలేని రమేష్ గతంలో బాడుగకు తీసుకున్నాడు. ఇందులో నాటు కోళ్లను పెంచుతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. అయితే ఆరోజు జరిగిన పార్టీకి తమ ప్రాంతానికి చెందిన ఎంపీ పుట్టా మహేష్ హాజరవుతున్న నేపథ్యంలో రమేష్ అక్కడికి వచ్చాడు. పార్టీలో మద్యం తాగాడు. పోలీసులు దాడులు చేసే సమయానికి రమేష్ అక్కడే ఉండడంతో అరెస్ట్ చేశారు. అతడి మీద ఎక్సైజ్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
