HomeతెలంగాణCM Revanth Reddy: రేవంత్‌ దూకుడు.. బలమా.. బలహీనతా.. తెరవెనుక ఏం జరుగుతోంది?

CM Revanth Reddy: రేవంత్‌ దూకుడు.. బలమా.. బలహీనతా.. తెరవెనుక ఏం జరుగుతోంది?

CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మాటలు కోటలు దాటుతున్నాయి. నేతలు నిగ్రహం కోల్పోతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నేతలు ఇంకా తాము ప్రతిపక్షంలోనే ఉన్నామన్నట్లు వ్యవహరిస్తుండగా, అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ నేతలు తాము ఇంకా అధికారంలో ఉన్నామన్న భావనలోనే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ఈధోరణి అధికార పార్టీ నేతల్లో మరింత అసహనం పెంచుతోంది. అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న నేతలను ధూషించడాన్ని సహించలేకపోతున్నారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలను అటాక్‌ చేస్తున్నారు. విపక్షంలో ఉన్నపట్టిలాగే దూకుడు ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తన పదునైన మాటలతో చీల్చి చెండాడుతున్నారు. అధికారం చెప్పట్టినప్పటి నుంచి ఇదే దూకుడు కొనసాగిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ తన ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ అధికారంలోకి వస్తామని బెదిరించడంతో ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీనే సగం ఖాళీ చేసేసి కేసీఆర్‌కు పెద్ద షాక్‌ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలలో కూడా బీఆర్‌ఎస్‌ పార్టీని దెబ్బ కొడితేనే కేసీఆర్‌ని కట్టడి చేయగలమని గ్రహించి దెబ్బ తీసి, ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు.

అనేక ఎదురుదెబ్బలు తిని..
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమంతో రాజకీయంగా ఎదిగారు. అంతకుముందు రాజకీయాల్లో ఉన్నా… తెలంగాణ ఉద్యమమే కేసీఆర్‌కు గుర్తింపు తెచ్చింది. ముఖ్యమంత్రిని చేసింది. ఇక రేవంత్‌రెడ్డి కూడా రాజకీయాల్లో అంత సుఖమైన ప్రయాణం సాగించలేదు. అనేక డక్కీమొక్కీలు తిన్నారు. టీడీపీలో ఓటుకునోటు కేసు.. కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. శ్రీరాముడు వానర సైన్యంతో మహా శక్తిశాలి అయిన రావణుడిని వదించిన్నట్లే, తన మాట అసలు వినని వానర సైన్యం వంటి కాంగ్రెస్‌ నేతలను వెంటబెట్టుకొని రేవంత్‌ రెడ్డి, రాజకీయాల్లో అపర చాణక్యుడని పేరు గుర్తింపు ఉన్న కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించారు. పామ్‌హౌస్‌కు పరిమితం చేశారు.

ఆ ఇద్దరూ కొరకరాని కొయ్యలా..
కేసీఆర్‌ అంతటివాడిని రేవంత్‌ రెడ్డి ఓడగొట్టారనే విషయం మరిచిన కేటీఆర్, హరీశ్‌ రావు ఇద్దరూ సీఎం రేవంత్‌రెడ్డికి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ముప్పు తిప్పలు పెడుతున్నారు. సబ్జెక్ట్, లెక్కల ఆధారంగా రేవంత్‌రెడ్డిని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్‌ రెడ్డికి కావలసింది కూడా అదే. లేకుంటే ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యల జాబితా కొండంత ఉంది. కేటీఆర్, హరీశ్‌రావుతో సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు పోరాటాలు చేస్తూ ప్రజల దృష్టిని సమస్యలపై నుంచి మళ్లిస్తున్నారు. ఇక కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రాకపోయినా, రేవంత్‌ రెడ్డి దూకుడు, వ్యూహాలను, వైఫల్యాలను నిశితంగానే గమనిస్తున్నారు. కవిత జైలు నుంచి బయటకు వచ్చేశాక కేసీఆర్‌ కూడా ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చి రేవంత్‌ రెడ్డి దూకుడుకి చెక్‌ పెడతారని తెలుస్తోంది. ఆ ప్రయత్నంలోనే కేసీఆర్‌ బీజేపీ పెద్దలతో తెర వెనుక రాయబారాలు నడుపుతున్నారని రేవంత్‌రెడ్డి స్వయంగా ఆరోపిస్తున్నారు. అంటే కేసీఆర్‌ వలన ప్రమాదం పొంచి ఉందని రేవంత్‌ రెడ్డి కూడా గ్రహించిన్నట్లు భావించవచ్చు. అందుకే కాంగ్రెస్‌ మంత్రులు కోరుకుంటున్న స్వేచ్ఛ, గౌరవం, ప్రాధాన్యత ఇస్తూ రేవంత్‌ రెడ్డి ఎవరూ పక్క చూపులు చూడకుండా జాగ్రత్తపడుతున్నారు.

బీజేపీ–బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేలా..
బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు చేతులు కలిపినా ఎదుర్కొనేలా రేవంత్‌రెడ్డి వ్యూహ రచన చేస్తున్నారు. అయితే అది అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. అందుకే ఇద్దరూ కలవకూడాదనే తరచూ కుమ్మక్కు ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ కలిస్తే అప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం కూడా రేవంత్‌ రెడ్డి చాలా ముందే పసిగట్టారని చెప్పవచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అభినందనలు తెలిపి విభజన సమస్యలపై చర్చలకు ఆహ్వానించారని అనుకోవచ్చు. తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి ఉండటం చంద్రబాబు నాయుడుకి ఎంత ముఖ్యమో, అదేవిదంగా ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడుగా ఉండటం రేవంత్‌రెడ్డికి కూడా అంతే అవసరం. అప్పుడే వారు తమ ఉమ్మడి శత్రువులు జగన్, కేసీఆర్‌ను కట్టడి చేయగలుగుతారు. అందుకే రేవంత్‌ రెడ్డి కాస్త దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. ఈ దూకుడు, వ్యూహాలు, అప్రమత్తం మాత్రమే సరిపోదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, సమస్యలు తీర్చడం కూడా చాలా అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version