Revanth Reddy comments viral: కుల వృత్తికి సాటి లేదు గువ్వల చెన్న అని.. వెనకటికి ఓ పాట ఉండేది. ఆ పాటలో అంతరార్థం చాలా లోతైనది. ఎందుకంటే కులం ఆధారంగా కొన్ని వృత్తులు ఏర్పడ్డాయి. ఆ వృత్తులు చాలామందికి బతుకును.. భరోసాను కల్పించాయి. అయితే నేటి కాలంలో చాలామంది కులవృత్తులకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది కుల వృత్తులను చేయడం నామోషీగా భావిస్తున్నారు. ఇంకొందరేమో పెద్ద చదువులు చదివి.. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే నేటికీ గ్రామాలలో కుల వృత్తులు కనిపిస్తున్నాయి. ఇంకా కొద్దిరోజులు పోతే ఆ కుల వృత్తులు చేసేవారు ఉండరు. అందులో ఏమాత్రం అనుమానం లేదు.
గ్రామాల విషయాన్ని పక్కన పెడితే.. పట్టణాలు, నగరాలలో కులవృత్తులను ఇతర కులాలకు సంబంధించిన వారు చేస్తున్నారు. కాకపోతే వాటికి వేరే విధమైన పేర్లు పెడుతున్నారు. వాటికి కార్పొరేట్ టచ్ ఇచ్చి.. భారీగా సంపాదిస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ “జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో రెడ్డి, కమ్మ కులాలకు సంబంధించిన వారు సెలూన్ లు నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద షాపులు పెట్టి భారీగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు కులవృత్తి అనేది ఒక కులానికి సంబంధించింది కాకుండా పోయింది. కుండలు.. మాంసం కొట్టుడు.. బట్టలు నేసుడు.. బంగారు ఆభరణాలు తయారు చేసుడు.. పనిముట్లు రూపొందించుడు.. ఇలా ప్రతి విభాగంలోనూ వేరే కులాల వారు వచ్చారు. వృత్తులపరంగా సజీవంగా ఉన్నప్పటికీ.. కులాల పరంగానే మార్పులు వస్తున్నాయని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. క్షౌర వృత్తి చేసే నాయి బ్రాహ్మణ కులస్తులు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతుంటే.. మిగతావారు మాత్రం స్వాగతిస్తున్నారు.. కులం అనేది ఒకప్పటి మాదిరిగా బలంగా లేకపోయినప్పటికీ.. జీవనోపాధి కోసం మనుషులు రకరకాల వృత్తులను ఎంచుకుంటున్నారు. అయితే కులంతో సంబంధం లేకుండా ఆయా వృత్తులలో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. ఫలితంగా డబ్బులు కూడా భారీగానే వెనుకేసుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు.
ఆ మధ్య సెలూన్ రంగంలోకి రిలయన్స్ కంపెనీ రావాలని భావించింది. టాటా కూడా సంప్రదింపులు జరిపింది. అయితే నాయి బ్రాహ్మణుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఆ కంపెనీలు వెనక్కి వెళ్ళాయి. అయితే కొంతమంది మాత్రం ఇందులో సంపాదన భారీగా ఉండడంతో ఈ రంగంలోకి వచ్చారు. పెద్ద కులాలకు సంబంధించిన వారు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టి ఫ్రాంచైజీలు కూడా ఓపెన్ చేశారు. మేకప్ నుంచి మొదలు పెడితే జుట్టు సంరక్షణ వరకు.. ఇలా అన్ని విభాగాలలో సేవలు అందిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అందువల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఆ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. నేటి కాలంలో కులాలు లేవని.. కేవలం వృత్తులు మాత్రమే ఉన్నాయని.. ఆర్థికంగా నిలబడేందుకు చాలామంది వృత్తులను ఎంచుకుంటున్నారని.. ముఖ్యమంత్రి ఆ సమావేశంలో చెప్పారు.
View this post on Instagram