Revanth Reddy And KTR
Revanth Reddy And KTR: తెలంగాణ రాజకీయాల్లో సాధారణంగా విభేదాలతో కనిపించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working prasident KTR) డీలిమిటేషన్ అంశంపై ఒకే వేదికపై ఐక్యతను ప్రదర్శించారు. తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమావేశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సమావేశం దక్షిణ భారత రాష్ట్రాలకు కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్(Delimitation) విధానంపై చర్చించేందుకు ఏర్పాటైంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్రెడ్డి, కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారత రాష్ట్రాలకు(South India States) కనీసం 33% పార్లమెంటు ప్రాతినిధ్యం కల్పించాలని గట్టిగా వాదించారు. జనాభా ఆధారంగా రూపొందుతున్న ఈ కొత్త విధానం దక్షిణాది రాష్ట్రాల సీట్లను తగ్గించే ప్రమాదం ఉందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం దక్షిణ రాష్ట్రాల హక్కులను కాలరాసే ప్రయత్నమని ఆయన ఆరోపించారు.
రేవంత్ వాదనకు కేటీఆర్ మద్దతు..
రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై స్పందించిన కేటీఆర్ దానిని పూర్తిగా ఆమోదించారు. ‘దక్షిణ భారత రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు 36% సహకారం అందిస్తున్నాయి. అలాంటప్పుడు పార్లమెంటు(Parlament)లో మనకు గణనీయమైన ప్రాతినిధ్యం ఉండాలి. మనం GDP లో 36% వాటా ఇస్తుంటే, అదే స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించడంలో సమస్య ఏమిటి?‘ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ(Telangana) హక్కుల కోసం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన తార్కికమైనదని, తమ పార్టీ కూడా దీన్ని సమర్థిస్తుందని ఆయన తెలిపారు.
డీలిమిటేషన్ కోసం..
సాధారణంగా రాజకీయ విధానాలు, ప్రజా సంక్షేమ నిర్ణయాలపై విభేదించే ఈ ఇద్దరు నేతలు డీలిమిటేషన్ వంటి కీలక అంశంలో ఒకే గొంతుకతో మాట్లాడటం గమనార్హం. దక్షిణ భారత రాష్ట్రాల ఐక్యత కోసం ఈ సమావేశం ఒక వేదికగా నిలిచింది. రేవంత్–కేటీఆర్ సమన్వయం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ భేదాలను పక్కనపెట్టి కలిసి పోరాడే సంకేతంగా నిలిచింది. ఈ అరుదైన సంఘటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది.