Pawan Kalyan
Pawan Kalyan: కేంద్రంలో ఏన్డీఏ కూటమిలో భాగస్వామి… ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలోనూ భాగస్వామి. పొత్తులో భాగంగా కేంద్రంలో టీడీపీకి ఎన్డీఏ ప్రభుత్వం రెండు మంత్రి పదవులు ఇచ్చింది. రాష్ట్రంలోనూ టీడీపీ సారథ్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూడా ఒక మంత్రి పదవి ఇచ్చింది. ఇలా బీజేపీతో అటు జాతీయస్థాయిలో.. ఇటు ఏపీలో పొత్తులో ఉన్న బీజేపీ.. తెలంగాణలో మాత్రం టీడీపీకి దూరంగా ఉంటోంది. పొరుగు రాష్ట్రం ఏపీలో ఉన్న మూడు పార్టీల పొత్తు తెలంగాణలో కొనసాగటంపై కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. బీజేపీ, జనసేన పొత్తుతో పోటీ చేశాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్పై ఆశలు పెంచుకుంటోంది. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ, జనసేన మైత్రిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీతో బీజేపీ కలుస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జనసేనాని కీలక వ్యాఖ్యలు..
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు అంజన్న దర్శనానికి బయల్దేరారు. తమ ఇంటి ఇలవేల్పుగా కొండగట్టు అంజన్నను పవన్ భావిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా కొండగట్టుకు వస్తున్నారు. పూజల తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్లోని ఇంటికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంటివద్ద సందడి నెలకొంది. పవన్ నివాసానికి వచ్చిన సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్సాయి సైతం వచ్చారు. మరోవైపు కొండగుట్ట వెళ్తున్న పవన్కు సిద్ధిపేటలో అభింఆనులు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో ఆయన తెలంగాణలో బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
పొత్తు కొనసాగింపు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–జనసేన కలిసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ పొత్తును తెలంగాణలో కొనసాగించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో టీడీపీతో కూడా పొత్తు ఉన్నందున తెలంగాణలో బీజేపీ–జనసేన మాత్రమే పొత్తులో ఉన్నాయి. టీడీపీని దూరం పెట్టారు. త్వరలో తెలంగాణలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు పంచాయతీ, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లోనూ బీజేపీ–జనసేన కలిసి పోటీచేసే అవకాశం ఉంది.
స్థానికంగా బలపడాలని..
ఏపీలో జనసేన బలం పెరిగింది. తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీలు కలిసి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ తెలంగాణలో బీజేపీతో పొత్తు కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీతోపాటు జనసేన కూడా బలపడుతుందని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ తెలంగాణలో బలహీనపడుతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టీడీపతో కలిసి పనిచేయడం కన్నా.. జనసేనతో కలిసి పని చేయడమే మేలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు.