TG MLC Election: తెలంగాణతోపాటు, ఏపీలో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 31న ఖాళీ కానున్నాయి. దీంతో ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతోపాటు రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలకు బీజేపీ(BJP) ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో అధికాంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నాయి. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్రెడ్డి(V.Narendar Reddy)ని అధిష్టానం నిర్ణయించింది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్(Velugopal)శుక్రవారం(జనవరి 31న) ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ స్థానం ఎమ్మెల్సీగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి ఉన్నారు.
తప్పుకున్న జీవన్రెడ్డి..
మొన్నటి వరకు మరోమారు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని జీవన్రెడ్డి(Jeevan Reddy) భావించారు. టీపీసీసీ నుంచి జీవన్రెడ్డి పేరునే అధిష్టానానికి పంపించారు. కానీ, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఈమేరకు ఏఐసీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో నరేందర్రెడ్డికి లైన్ క్లియర్ అయింది. ఈ విషయాన్ని మంత్రి డి.శ్రీధర్బాబు గురువారం (జనవరి 30న) వెల్లడించారు. మరుసటి రోజే నరేందర్రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే..
ఇక నరేందర్రెడ్డి ఎంపిక వెనుక అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. ముందుగా నరేందర్రెడ్డితోపాటు ప్రసన్న హరికృష్ణ పేర్లను పరిశీలించింది. తర్వాత క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించింది. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 42 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ఎంపీల అభిప్రాయాలను సేకరించింది. తర్వాతే నరేందర్రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 3.47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగానికిపైగా ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా నుంచే ఉన్నారు. ఈ కారణంగా కూడా కాంగ్రెస్ పార్టీ నరేందర్రెడ్డివైపు మొగ్గుచూపినట్లు సమాచారం.
బీఆర్ఎస్ అభ్యర్థిగా రవీందర్సింగ్?
ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికకు కసరత్తు చేస్తోంది. సీనియర్ నేతలెవరూ పార్టీ తరఫున పోటీకి ఆసక్తి చూపడం లేదు. మాజీ మేయర్ రవీందర్సింగ్(Ravindar Singh) ఒక్కరే పోటీకి సముందుకు వస్తున్నారు. దీంతో ఆయననే బరిలోనిలిపే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల..
ఇదిలా ఉంటే.. త్వరలో ఖాళీ అయ్యే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను ఈసీ రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అదే రోజు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13 వరకు ఉప సంహరణకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.