Janardhan Reddy KBR Park history: కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి సంజీవని లాంటిది. కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాదు నగరంలో ఈ పార్క్ ఒక అడవి లాగా కనిపిస్తుంది. ఈ పార్క్ ను కాపాడేందుకు గత ప్రభుత్వాలు ఏకంగా 25 మీటర్ల వరకు సున్నితమైన పర్యావరణ జోన్ గా నిర్దేశించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పరిధిని మూడు మీటర్లకు కుదించింది. అంతేకాదు, 25 నుంచి 35 మీటర్ల ఎత్తులో ఉన్న చెట్లను నరికి వేయడానికి అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ పనులు రాత్రి పగలు అని తేడా లేకుండా జరుగుతున్నాయి.
అయితే ఓ మహిళ ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఆసక్తిని చూపించలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించారు. కేసును విచారించిన సుప్రీంకోర్టు.. కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి పనులు చేపట్టకూడదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి కేబీఆర్ పార్కు చుట్టూ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. పైగా ఆ ప్రాంతం అత్యంత సున్నితమైనది.
కేబీఆర్ పార్క్ నేడు ఒక అడవిలాగా కనిపిస్తోంది అంటే దానికి ప్రధాన కారణం దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. హైదరాబాద్ నగరానికి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటి వనాన్ని ఏర్పాటు చేశారంటే దాని ఘనత ముమ్మాటికి జనార్దన్ రెడ్డిదే. నిజాం యువరాజు ముఫకంజాకు అప్పటి హైదరాబాద్ నగరంలో విపరీతంగా భూములు ఉండేవి. అప్పట్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం అమలుకు వచ్చిన తర్వాత ముఫకంజా వద్ద 390 ఎకరాల పట్టణ మిగులు భూమి ఉన్నట్టు అప్పటి ప్రభుత్వం గుర్తించింది. దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటికి హైదరాబాద్ నగరం పంజాగుట్ట దాటి విస్తరించలేదు. పైగా నగరానికి ఆనుకుని ఉన్న ప్రాంతం కావడంతో అప్పట్లో శాసనసభ్యుల బృందం ముఖ్యమంత్రి ని కలిసింది.
ముఫకంజా నుంచి స్వాధీనం చేసుకున్న మిగులు భూమిని ప్లాట్లుగా విభజించి తమకు అందజేయాలని వారు కోరారు. ముఖ్యమంత్రిగా జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఆ లేఖను నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావుకు ఇచ్చారు. పరిశీలించాలని సూచించారు. అయితే ఈ భూమి ప్రభుత్వ చట్టాల ప్రకారం పేదలకు.. ఇళ్ళు లేని వారికి మాత్రమే ఇవ్వాలని ఉందని మాధవరావు జనార్దన్ రెడ్డికి వివరించారు. దీంతో జనార్దన్ రెడ్డి ప్రత్యామ్నాయ స్థలాలలో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ప్లాట్లు కేటాయించారు.
ముపకంజా నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూమి సమస్యను పరిష్కరించడానికి జనార్దన్ రెడ్డి ఒక కీలక ప్రణాళిక రూపొందించారు. ఆ స్థలాన్ని ఉద్యానవనంగా మార్చాలని సూచించారు.అంతేకాదు, భవిష్యత్తు కాలంలో దానిని ఎవరు ఆక్రమించకుండా ఉండడానికి అనేక చట్టాలను తీసుకొచ్చారు. అలా ఆ పార్కు రూపాంతరం చెందింది. జనార్దన్ రెడ్డి పదవి నుంచి వెళ్లిపోయిన తర్వాత.. చాలా రోజులకు దానికి ఒక పేరు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. చివరికి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరును దానికి పెట్టారు. వాస్తవానికి ముపకంజా నుంచి భూమి స్వాధీనం చేసుకునే సమయానికి ముందు బ్రహ్మానందరెడ్డి కన్నుమూశారు. ఆ పార్కు పేరు పెట్టే విషయం తనకు తెలియదని.. ఒకవేళ పేరు పెట్టాల్సి వస్తే జనార్దన్ రెడ్డి పేరు ఎందుకు పెట్టాలో తాను చెప్పేవాడినని కాకి మాధవరావు అనే సందర్భాల్లో పేర్కొన్నారు.
కేవలం ఇది మాత్రమే కాదు
.. ఫిలింనగర్ ఏరియాలో ఆల్ ఇండియా అత్యున్నత సర్వే అధికారుల కోసం 50 ఎకరాల స్థలాన్ని కూడా జనార్దన్ రెడ్డి కేటాయించారు. నాడు సొంత ఇల్లు లేని 258 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు గజానికి 500 చొప్పున స్వీకరించి ఫ్లాట్లను కేటాయించారు. అధికారుల గృహాలలో పని చేసే వారి కోసం రెండు ఎకరాలను కేటాయించారు. ప్రశాసన్ నగర్ హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ కాలనీ రూపాంతరం చెందింది.
