Chandrababu Delhi Visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈసారి ఆయన పర్యటన ఆసక్తికరంగా ఉండబోతుందన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈసారి టిడిపికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ కీలక పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసి అవకాశం ఉంది. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. గురువారం రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సైతం ఆయన హాజరవుతారు. గురువారం రాత్రికి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరవుతుండడం విశేషం.
* సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. రాష్ట్రపతి భవన్ లో గురువారం ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
* సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది.
* కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై కూడా చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చిస్తారని తెలుస్తోంది.
* లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పదవి ఏపీకి కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. దీనిపై కూడా చర్చించే పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి గుడ్ న్యూస్ తో వస్తారని కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.
