Malla Reddy: ఒకప్పుడు రాజకీయాలు మెరుగ్గా ఉండేవి. నేతలు మెజారిటీ శాతం ప్రజాసేవ చేసేవారు. కొంత శాతం మాత్రమే సంపాదించుకోవడానికి తమ పదవిని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజకీయాలు అంటే పూర్తిగా కమర్షియల్ గా మారిపోయాయి. భారీగా డబ్బును ఇన్వెస్ట్ చేయడం.. ఆ తర్వాత వాటి నుంచి ప్రాఫిట్ ఆశించడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిపోయింది.
రాజకీయాలలో ఒకప్పుడు సామాన్య నేపథ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఉండేవారు. కానీ ఆ తర్వాత వ్యాపారులు కూడా ఇందులోకి ప్రవేశించడం మొదలుపెట్టారు. ఒక రకంగా రాజకీయాలు మొత్తం కార్పొరేట్ మయం కావడానికి ఇటువంటి వ్యాపారవేత్తలే కారణం. వ్యాపారవేత్తలు పార్టీలకు భారీగా ఫండ్ ఇవ్వడం.. తమ వ్యాపారాన్ని మరింత లాభసాటిగా చేసుకోవడం మొదలుపెట్టారు.. దీంతో రాజకీయ పార్టీలు వ్యాపారవేత్తలు లేకుండా కొనసాగే పరిస్థితి లేకుండా పోయింది.
తెలుగులో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న వ్యాపారవేత్తలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇందులో కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నతమైన పదవులను అనుభవిస్తున్నారు. అటువంటి వారిలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ముందు వరసలో ఉంటారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన టిడిపి నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మేడ్చల్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి మల్లారెడ్డి కంటే సీనియర్ నాయకులు చాలామంది ఉన్నప్పటికీ కెసిఆర్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారంటే.. మల్లారెడ్డికి ఉన్న పరపతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా మల్లారెడ్డి వ్యాపారవేత్త. ఆయనకు లెక్కకు మిక్కిలి విద్యాసంస్థలు ఉన్నాయి. అందులో కొన్ని నిర్మాణాలు అక్రమంగా చేపట్టారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి నిర్మించిన అక్రమ నిర్మాణాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంతలో కొంత పడగొట్టగలిగింది. రేవంత్ రెడ్డి మీద గతంలో మల్లారెడ్డి అనేక విమర్శలు చేశారు. తొడకొట్టి సవాల్ కూడా చేశారు.. ఈ నేపథ్యంలో తన ఆస్తులను కాపాడుకోవడానికి మల్లారెడ్డి బిజెపి లోకి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవల తన కోడలు ప్రీతి రెడ్డితో కలిసి ఆయన ప్రధానమంత్రిని కలిశారు. దీంతో తెలంగాణ రాజకీయాలలో కలకలం నెలకొంది.
ఇటీవల కాలంలో గులాబీ పార్టీలోకి కాంగ్రెస్ నేతలు చేరుతున్నారు. ఆ పరిణామాన్ని గులాబీ పార్టీ గొప్పగా చెప్పుకుంటున్నది. కానీ మల్లారెడ్డి ఏగంగా బిజెపిలో చేరుతున్నారనే వస్తున్న వార్తలు గులాబీ క్యాంపులో కలకలం రేపుతున్నాయి. మల్లారెడ్డి కోడలు ఆమధ్య బండి సంజయ్ ని కలిశారు. చాలాసేపు మాట్లాడారు. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ.. వారిద్దరూ కేవలం బోనాల పండుగ సందర్భంగా కలిసారని అందరూ అనుకున్నారు.
మల్లారెడ్డి బిజెపిలో చేరుతున్నారనే విషయం తెలిసిన నేపథ్యంలో కెసిఆర్ ఇటీవల జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గోడ మీది పిల్లి లాంటి నాయకులు వెళ్లిపోవడం మంచిదని మొహమాటం లేకుండా చెప్పారు. ఆ ప్రకారం చూసుకుంటే మల్లారెడ్డి వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది. మల్లారెడ్డి ఇప్పుడు పొలిటికల్ గా చాలా ఎత్తుకు ఎదిగారు.. ఇలాంటి క్రమంలో కేసీఆర్ హెచ్చరికలను మల్లారెడ్డి పట్టించుకుంటారా? అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.